12 ఏళ్ల పాటు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. కోర్టు తీర్పుపై సబితా ఇంద్రారెడ్డి ఎమోషనల్
Publish Date:May 6, 2025
.webp)
Advertisement
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కేసులో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించడంపై మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడుతూ, పన్నెండున్నరేళ్ల క్రితం ఈ కేసు విషయంలో కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కాను. ఎలాంటి తప్పు చేయకపోయినా నన్ను ఈ కేసులో చేర్చడం తీవ్రంగా బాధించిందన్నారు. అయితే, న్యాయవ్యవస్థ ద్వారా నాకు తప్పక న్యాయం జరుగుతుందని మొదటి నుంచి నమ్మాను. ఈ రోజు ఆ నమ్మకమే నిజమైంది" అని సబితా ఇంద్రారెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. కొన్ని సంవత్సరాలుగా తాను ఎదుర్కొన్న మానసిక వేదనను ఆమె గుర్తుచేసుకున్నారు.
ఇన్నేళ్లుగా నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ప్రతిపక్షంలో ఉన్నవారు నన్ను అవినీతిపరురాలిగా చిత్రీకరించారు. జైలుకు వెళతానని దుష్ప్రచారం చేశారు. ఆ మాటలు నన్ను తీవ్రంగా గాయపరిచాయి. అయినప్పటికీ, నా జిల్లా ప్రజలు, ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలు నాపై సంపూర్ణ విశ్వాసం ఉంచి నా వెన్నంటే నిలిచారు. ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా వాటిని నమ్మకుండా నాకు మద్దతుగా నిలిచి నన్ను గెలిపిస్తూ వచ్చారు. ఈ కష్టకాలంలో నాతో పాటు ఉండి, ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని ఆమె పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఏడుగురికి శిక్ష ఖరారు చేసింది. ఇద్దరికి శిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఐఏఎస్ కృపానందంలకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
http://www.teluguone.com/news/content/obulapuram-mining-case-39-197585.html












