EVM మళ్ళీ మళ్ళీ గెలిచింది, గెలుస్తుంది!
Publish Date:Apr 25, 2024
Advertisement
ఎన్నికలు వస్తె, పదే పదే ఈవిఎం ల మీద దుమ్మెత్తి పోసే వారికి కొదవలేదు. గత 40 ఏళ్లుగా అనేక అవరోధాలను అధిగమించి, భారత దేశ సాంకేతికతకు తిరుగులేదని ఓటింగు యంత్రాలు అనేక సార్లు నిరూపించుకున్నాయి. ఇప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం మరోమారు ఓటింగు యంత్రాలు పట్ల పూర్తి విశ్వాసం వెలువరించింది. వూహాజనిత ఆరోపణలపై ఓటింగు యంత్రాలపని తీరును తప్పు పట్టలేమని స్పష్టం చేసింది. ఓటింగు యంత్రాలను వ్యతిరేకించే వారి వాదన మన దేశ సాంకేతికతను అవమానించేలా ఉంటుంది. ప్రపంచంలో ఫలానా దేశాల్లో వాడటం లేదు, ఫలానా దేశాలు నిషేధించాయి కనుక ఓటింగు యంత్రాలు నమ్మదగినవి కావు అని వాదిస్తారు. బుర్ర తక్కువ లేదా భారత దేశం కనుగొన్న ఓటింగు యంత్రాలను మేము ఎందుకు వాడాలి అనే బలుపుతో ఆయాదేశాలు వాడటం లేదు అని కోణంలో ఆలోచించరు. లక్షలాది ఓటింగు యంత్రాలు గల్లంతు అయ్యాయి అనే ఆరోపణ రాజకీయ పరమైంది. ఒకవేళ ఓటింగు యంత్రాలు దొంగిలించబడ్డా... వాటితో ఏమీ చేయలేరు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంతమంది దుమ్మెత్తి పోసినా, ఓటింగు యంత్రాలుతోనే ఎన్నికలు నిర్వహిస్తున్న భారత ఎన్నికల సంఘం తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. ఈవిఎంలపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈవిఎంల ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఈవిఎంల ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం లేదని అంటోంది. సాంకేతిక సమస్యలపై ఈవిఎంలు మొరాయించే అవకాశం మాత్రమే ఉంది గానీ అక్రమాలకు పాల్పడే లేదా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదని అంటోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు సురక్షితమైనవనీ, ఇవి భారతదేశానికి గర్వకారణమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర చెబుతున్నారు. EVM సింగిల్ చిప్ ప్రోగ్రామ్ మాత్రమేననీ, ఫ్రీక్వెన్సీ లేదనీ.. కాబట్టి హ్యాకింగ్ ప్రశ్నే లేదని తెలిపారు. వాటిని ట్యాంపరింగ్ చేయడం లేదా హ్యాక్ చేయడం సాధ్యం కాదన్నారు. భారత దేశం ఎంతో వేగంగా, సకాలంలో, ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలను అందించగలదో తెలుసుకోవడానికి అనేక దేశాలు ఆసక్తిగా ఉన్నాయని అన్నారు. ఈవీఎం అనేది సింగిల్ చిప్ ప్రోగ్రామ్ అని సుశీల్ చంద్ర తెలిపారు. దీనిని ట్యాంపరింగ్ చేయలేరని, హ్యాకింగ్ ప్రశ్నే తలెత్తదని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో VVPAT ఆడిట్ ట్రయల్ కూడా ఉంటుందన్నారు. దీంతో ఈవీఎంలు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయని వివరించారు. చాలా తక్కువ సమయంలో వేగంగా, ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలు భారత్లో ఎలా సాధ్యం అని పలు దేశాలు ఆశ్చర్యపోతున్నాయని అన్నారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతత, అవగాహన చాలా కీలకమని, అందువల్ల ఈవీఎంల క్రమబద్ధమైన నిల్వ, నిర్వహణ, తరలింపు కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, చెక్లిస్ట్ అనుసరించడం చాలా కీలకమని ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే చెబుతున్నారు. - ఎం.కె.ఫజల్
http://www.teluguone.com/news/content/no-evidence-of-hacking-39-174501.html