నాగార్జున వాదనలో పస ఉందా?
Publish Date:Jul 1, 2014
Advertisement
సినీ నటుడు నాగార్జునకు చెందిన యన్.కన్వెన్షన్ కొరకు 3.55 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసారని జీ.హెచ్.యం.సి. అధికారులు నోటీసులు జారీ చేయడంతో, ఆయన ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హైకోర్టును ఆశ్రయించారు. తాము 1992లో కొందరు వ్యక్తుల వద్ద నుండి పూర్తి న్యాయబద్దంగా 27 వేల చదరపు మీటర్ల స్థలాన్ని కొని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకొని, అక్కడ ‘యన్ కన్వెన్షన్’ నిర్మించి, దానికి ప్రభుత్వం విదించిన అన్ని పన్నులను నాటి నుండి నేటి వరకు సకాలంలో కడుతున్నానని, ఇటీవల ప్రభుత్వం భవనాల క్రమబద్దీకరణకు అవకాశం ఇచ్చినపుడు దానికి కూడా తాను దరఖాస్తు చేసుకున్నానని ఆయన కోర్టుకు తెలిపారు. గత 22 సం.లుగా అధికారులకు తన స్థలంపై ఎటువంటి సందేహము కలగనది, ఇప్పుడు అకస్మాతుగా అదొక అక్రమకట్టడమని ఏవిధంగా నోటీసులు జారీ చేసారని నాగార్జున తన పిటిషనులో ప్రశ్నించారు. నాగార్జున తన పిటిషనులో బఫర్ జోన్ వంటి ఇతర సాంకేతిక అంశాలపై కూడా తన వివరణ ఇచ్చి తనకు న్యాయం చేయవలసిందిగా కోర్టును కోరారు. నాగార్జున వాదన నూటికి నూరుపాళ్ళు సరయినదే. ఇంతకాలంగా ఆయన వద్ద నుండి జీ.హెచ్.యం.సి. వివిధ పన్నులు వసూలు చేసుకొంటున్నందున యన్.కన్వెన్షన్ చట్టబద్దంగా నెలకొల్పబడిందేనని ద్రువీకరించినట్లే భావించవచ్చును. ఒకవేళ అదొక అక్రమ కట్టడమని వారు భావించి ఉండి ఉంటే దానికి ఎటువంటి అనుమతులు ఇచ్చి ఉండకూడదు. భవన నిర్మాణాన్ని మొదటే అడ్డుకొని ఉండాలి. కానీ వారు అలా చేయలేదు. పైగా పన్నులు కూడా వసూలు చేసుకొన్నారు. అటువంటప్పుడు దానిని అక్రమ కట్టడమని ఇప్పుడు వారు వాదిస్తే కోర్టులో మొట్టికాయలు తప్పకపోవచ్చును. కానీ నాగార్జున అధికార పార్టీతో సత్సంబంధాలు కలిగి ఉన్నపుడు, జీ.హెచ్.యం.సి. అధికారులు మాత్రం ఆయనపై చర్యలు తీసుకొనేందుకు ఏవిధంగా సాహసించగలరు? అయితే ఈ విషయాన్ని సదరు అధికారులు కోర్టులో ప్రస్తావించలేరు. ఆ సంగతి కోర్టుకు, ప్రభుత్వానికి, నాగార్జునకు అందరికీ కూడా తెలుసు. అందుకే నాగార్జున దైర్యంగా కోర్టులో పిటిషను వేయగలిగారు. ప్రభుత్వం తలుచుకొంటే అక్రమం సక్రమమవుతుంది, సక్రమం అక్రమవుతుంది. అందుకే ఇంతవరకు ఏ అధికారి కూడా ఆయన జోలికి రాలేదు. కానీ ప్రభుత్వాలు మారిన తరువాత కొత్తగా అధికారం చేప్పట్టిన వారితో కూడా ఏ కారణంగానయినా స్నేహ సంబంధాలు కొనసాగించలేకపోతే, ఇటువంటి సమస్యలు పుట్టుకొస్తాయని స్పష్టమవుతోంది. ఏమయినప్పటికీ చట్టబద్దంగా చూసినట్లయితే నాగార్జున సేఫ్ గా ఉన్నట్లే కనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/nagarjuna-45-35408.html





