Publish Date:Nov 10, 2012
Advertisement
సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ మరోసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుని ఉన్నపళంగా అమలుచేస్తే అది అందమైన ధనిక మహిళలకు ఉపయోగపడుతుంది తప్ప అందంగా లేని గ్రామీణ మహిళలకు ఉపయోగం లేదంటూ అడ్డంగా మాట్లాడి ఇరుక్కున్నారు. ములాయం చేసిన వ్యాఖ్యలపై మహిళాలోకం గళమెత్తింది. తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతోంది. యూపీలోని బారాబంకీ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ములాయం ఉద్దేశం ఏదైనా నేరుగా ఆయన గ్రామీణ మహిళల్ని అనాకారులన్నట్టేనంటూ మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఆడాళ్లంటే అంత చులకనా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు ములాయం ఇలాగే అడ్డంగా మాట్లాడి మహిళాలోకం నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు ఎదుర్కున్నారు. బిల్లుని ఉన్నది ఉన్నట్టుగా ఆమోదిస్తే పార్లమెంట్ లో యూత్ ఈల వేస్తారంటూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయ్. ఇప్పుడు మళ్లీ చాలా రోజుల తర్వాత ములాయం మరోసారి అలాంటి మాటలే మాట్లాడి మహిళాలోకం ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు.
http://www.teluguone.com/news/content/mulayam-coments-37-19015.html





