బాలీవుడ్ కంటే భారతే ముఖ్యం!
Publish Date:Oct 18, 2016
Advertisement
ఇండియా, పాకిస్తాన్, సర్జికల్ స్ట్రైక్స్, బాలీవుడ్ లో పాకిస్తానీ కళకారులపై నిషేధం.... వీటన్నటి మధ్యలోకి ఇప్పుడు ముఖేష్ అంబానీ అనే పదం కూడా వచ్చి చేరింది! ఈ సారి మీరు గూగుల్ సర్చ్ లో ఇండియా , పాకిస్తాన్ అని టైప్ చేస్తే అంబానీ ఏమన్నాడో కూడా దర్శనమిస్తుంది! రోజుకొకరి చొప్పున ఈ మ్యాటర్ లో సెలబ్రిటీలు, వీఐపీలు కాలు పెడుతుండటంతో తానూ ఎంట్రీ ఇచ్చాడు ది రిచ్చెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా! ఏదో ఎప్పటిలాగే ఓ ఉగ్రవాద దాడి జరిగిందనుకున్నారు అంతా. కాని, మన జవాన్లు 19మంది చనిపోయారంటే అందరూ రగిలిపోయారు. తరువాత సర్జికల్ స్ట్రైక్స్ చేసి దాదాపు 40మంది ఉగ్రవాదుల్ని మన సైన్యం మట్టుబెడితే మళ్లీ ఉత్సాహం రేగింది దేశంలో. కాని, అప్పట్నుంచే సమస్య కూడా మొదలైంది. ఒకవైపు మోదీ ఎక్కడ సర్జికల్ స్ట్రైక్స్ క్రెడిట్ కొట్టేస్తాడోనని అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ లాంటి వారు భయపడుతుంటే... రాజ్ థాక్రే లాంటి వాళ్లు లోకల్ గా నానా రచ్చ చేస్తున్నారు. బాలీవుడ్లో పాకిస్తాన్ కళాకారులు కనిపించటానికి వీలు లేదని ఆర్డర్ లు వేశారు. దాని ఫలితంగా మళ్లీ గొడవ పెద్దదైపోయింది. మహేష్ భట్ నుంచి అనురాగ్ కశ్యప్ దాకా అందరూ పాకిస్తానీ కళాకారులు కావాలని తెగ ఫీలైపోయారు. అదెలా కుదురుతుందని అనుపమ్ ఖేర్ లాంటి బి-టౌన్ సెలబ్స్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఒక వైపు ఆందోళన కలిగిస్తుంటే రోజుకో వింత స్టేట్మెంట్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రతీ వారూ మోదీని టార్గెట్ చేసి హైలైట్ అవ్వాలనుకుంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ మొదలు అనురాగ్ కశ్యప్ వరకూ అందరిదీ ఇదే పద్ధతి! కాని, మోదీకి అండగా ఇప్పుడు అత్యంత బలమైన వ్యక్తి వచ్చి నిలబడ్డట్టైంది! అతనే ముఖేష్ అంబానీ! అంబానీ మేధావి కాకపోవచ్చుగాని వ్యాపార మేధావి మాత్రం తప్పుకుండా. అందుకే, జియోను మార్కెట్లోకి తెచ్చి సంచలనం సృష్టించిన అంబానీ దేశం వైపు, మోదీ వైపు నిలిచాడు. ఇది ఆయన ప్రాడక్ట్ కి మంచి పబ్లిసిటీనే కాక అంబానీపై యావత్ దేశానికి మంచి అభిప్రాయం కలిగేలా చేస్తుంది! ముఖేష్ అంబానీ పాకిస్తానీ కళకారులైనా ఎవరైనా దేశం తరువాతే అనటమే కాదు... తాను స్పాన్సర్ చేసిన ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక పాకిస్తానీ సినిమా ప్రదర్శన కూడా నిలిపి వేయించాడు! మొత్తానికి దేశం యుద్ధం ముంగిట్లో నిలుచున్నా ఇంత కాలం పాక్ కళకారులు కావాలని అల్లాడిపోయిన బాలీవుడ్ వాల్లు, మీడియా వాళ్లు అంబానీ స్టాండ్ చూసి ఆలోచన మార్చుకునే అవకాశం వుంది! ఎందుకంటే, ఇండస్ట్రీలో అత్యంత గొప్ప వాడితో విభేదించటం ఎవరికైనా, ఎప్పటికైనా ప్రమాదకరమే! కాబట్టి అంబానీకి తమ విదేయత చాటే ఉద్దేశ్యం వున్న చాలా మంది బాలీవుడ్ వాళ్లు కూడా ఇక ధైర్యంగా జై భారత్ మాతా అంటారు!
రెలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఢిల్లీలో ప్రభుత్వాల్ని శాసిస్తాడని అందరికీ తెలిసిందే. అయితే, ఆయన ఎలాంటి ముసుగులో గుద్దులాట లేకుండా తన అభిప్రాయం చెప్పాడు. కళలు, సంస్కృతి అన్నిటికంటే తనకు దేశమే ముఖ్యమని అన్నాడు. అందరు భారతీయుల్లాగే తాను కూడా ఇండియా ఫస్ట్ అనుకుంటానన్నాడు! పైగా తాను మేధావిని కానని... పాకిస్తాన్ తో మైత్రి, పాకిస్తాన్ కళాకారుల్ని ఇక్కడ నిషేధించకపోవటం... ఇవి తనకు అర్థం కావని ముక్తాయింపు ఇచ్చాడు!
http://www.teluguone.com/news/content/mukesh-ambani-45-67977.html





