మిథున్రెడ్డికి సుప్రీం షాక్.. అరెస్ట్కు రంగం సిద్దం చేసిన సిట్
Publish Date:Jul 18, 2025

Advertisement
రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. లిక్కర్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటీషన్ను తిరస్కరించడంతో.. దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మిథున్రెడ్డికి అక్కడా చుక్కెదురైంది. మరోవైపు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. త్వరలోనే మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారనే చర్చ జరుగుతోంది. పరారీలో ఉన్న మిథున్రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు.
మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ కావడంతో ఆయన తలదాచుకున్న ప్రాంతాల్లో సోదాలు, అరెస్ట్ చేసేందుకు చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నారు సిట్ అధికారులు. మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు.. మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించడం, లొంగిపోవడానికి సమయమిచ్చేందుకు నిరాకరించడంలో ఆయన అరెస్ట్ ఖాయమైంది.
లిక్కర్ కేసులో తన ప్రమేయం లేకపోయినా.. రాజకీయ కక్షలో భాగంగా తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని మిథున్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ జరిపిన జస్టిస్ జెబి పార్థివలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం.. అరెస్ట్ చేయకుండా ఛార్జ్ షీట్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. సరెండర్ కావడానికి వారం రోజులు గడువు ఇవ్వాలని మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనాన్ని కోరగా.. దానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. తాజాగా సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
http://www.teluguone.com/news/content/mp-peddireddy-mithun-reddy-39-202216.html












