ఆదర్శ రైతు మంత్రి రామానాయుడు..సొంత పొలంలో ఎన్ని బస్తాలు వడ్లు పండించారంటే?
Publish Date:May 8, 2025
Advertisement
రైతు బిడ్డగా వ్యవసాయం గురించి, రైతుల కష్టాల గురించి తెలిసిన మంత్రి రామానాయుడు ఆదర్శ రైతుగా నిలిచారు. ఆయన సొంత పొలంలో దాల్వా వరి సాగులో ఎకరానికి 65 బస్తాలు అధిక దిగుబడులు సాధించారు. అతి తక్కువ పెట్టుబడులతో యాజమాన్య పద్ధతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలతో అధిక దిగుబడులు సాధించినట్లు పాలకొల్లు వ్యవసాయ సహాయ సంచాలకురాలు అద్దాల పార్వతి, పాలకొల్లు మండల వ్యవసాయ అధికారి కే రాజశేఖర్ లు తెలిపారు. పాలకొల్లు వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇరువురు వివరాలను వెల్లడించారు. పాలకొల్లు మండలం ఆగర్తి పాలెం గ్రామంలో మంత్రి రామానాయుడు తన ఆరు ఎకరాల విస్తీర్ణంలో వరి పి ఆర్ 126 సన్న రకం ( గ్రేడ్ A) దాల్వా సాగు చేశారు. ఎకరానికి 65 బస్తాలు చొప్పున ఆరెకరాల్లో 390 బస్తాలు దిగుబడి సాధించారు. అతి తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు పొందారు.ఆయన ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యలను తీర్చడంలోనూ, మరోపక్క కీలకమైన జల వనరుల శాఖ మంత్రిగా ఎంత బిజీగా, ఒత్తిడితో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఉండే రెండు రోజుల్లో కొద్దిపాటి సమయం దొరికినప్పుడల్లా పొలం కి వెళ్లి స్వయంగా వ్యవసాయ పనులు చేశారు. నాట్లు వేయడం దగ్గర నుంచి కలుపు తీయడం, ఎరువులు వేయడం, పురుగుమందులు చల్లడం ఇలా ప్రతి పనిలోనూ వ్యవసాయ కూలీలతో కలిసి మేమేకమయ్యేవారు. పంటకు కావలసిన యాజమాన్య పద్ధతులు, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా సస్య సంరక్షణ చర్యలు తీసుకోవడం వంటివి చేశారు. ఎక్కడ పోల్లు గింజలు లేకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకున్నారు. సకాలంలో నారు పోసి నాట్లు వేయడం, ఎరువులు, నీటి యాజమాన్య పద్ధతులు, పురుగులు, తెగుళ్లు నివారణ చర్యలు, నీటి ఎద్దడి లేకుండా ఎప్పటికప్పుడు మురుగునీరు బయటికి తీసి పిలక దశలో చేనును ఆరబెట్టడం ద్వారా పైరు,వేర్లకు గాలి వెళ్తురు బాగా తగలడం, అధికంగా పిలకలు మొలవడం వంటివి అధిక దిగుబడులకు సాధ్యమైంది. మరీ ముఖ్యంగా వ్యవసాయ అధికారులు,శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ అధిక దిగుబడులతో మంచి ఫలితాలు సాధించారు. ప్రతి రైతు ఈ విధంగా వ్యవసాయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కనపరిస్తే మంచి దిగుబడులు పొందవచ్చునని ఏడీఈ పార్వతి, ఏడి రాజశేఖర్ లు తెలిపారు. ఆదర్శ రైతుగా నిలిచిన మంత్రి రామానాయుడు ను వ్యవసాయ శాఖ తరపున ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు.
http://www.teluguone.com/news/content/minister-ramanaidu-25-197721.html





