పేద పిల్లలకు మంచి భోజనం పెడుతుంటే ఎందుకు ఏడుస్తున్నారు : లోకేష్
Publish Date:Jun 28, 2026
Advertisement
ఏపీలో స్మార్ట్ కిచెన్లపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు..జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'స్మార్ట్ కిచెన్' లపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. పాఠశాల పిల్లలకు రుచికరమైన, పరిశుభ్రమైన భోజనం అందుతుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు తట్టుకోలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. పేద విద్యార్థుల సంక్షేమం చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక ఏడుస్తున్నాయని మండిపడ్డారు. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు వల్ల ఎవరి ఉపాధి కూడా కోల్పోయే పరిస్థితి లేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే ఐదు స్మార్ట్ కిచెన్లను ప్రారంభించామని, అక్కడ పనిచేస్తున్న 233 మంది కుక్-కమ్-హెల్పర్లు యథావిధిగా తమ విధుల్లో కొనసాగుతున్నారని తెలిపారు. త్వరలో జిల్లావ్యాప్తంగా మరో 33 ఆధునిక వంటశాలలను ఏర్పాటు చేయబోతున్నామని, దీనివల్ల ఏ ఒక్కరి ఉద్యోగానికి ముప్పు వాటిల్లదని ఆయన భరోసా ఇచ్చారు. పైగా ఈ నూతన విధానం వల్ల రాష్ట్రంలో మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి పేర్కొన్నారు. కొత్త కిచెన్ల నిర్వహణ కోసం స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. వీటి ద్వారా అదనంగా 38 మంది హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్లు, దాదాపు 76 మంది డ్రైవర్లకు కొత్తగా ఉపాధి లభించనుందని గణాంకాలతో సహా వివరించారు. కుక్-కమ్-హెల్పర్లకు వేతన బకాయిలు ఉన్నాయంటూ వైఎస్ జగన్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మంత్రి కొట్టిపారేశారు. కడప జిల్లాలోని 3,450 మంది సిబ్బందికి 2026 ఏప్రిల్ నెల వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించామని స్పష్టం చేశారు. మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవులు ఉండటం వల్ల నిబంధనల ప్రకారం వేతనం ఉండదని, జూన్ నెల ఇంకా పూర్తి కాకముందే బకాయిలంటూ తప్పుడు ప్రచారం చేయడం తగదని జగన్ కు హితవు పలికారు. గతంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యతపై అక్కడక్కడా వస్తున్న ఫిర్యాదులను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించే క్రమంలోనే ఈ కేంద్రీకృత స్మార్ట్ కిచెన్ వ్యవస్థను ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. పిల్లల ఆరోగ్యం విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రతిరోజూ ఉపాధ్యాయులు ఆహారాన్ని రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలనే నిబంధనలు కూడా తెచ్చినట్లు లోకేష్ గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందికి అదనపు ఉపాధి లభిస్తుంటే, ప్రతిపక్ష నేత కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే బురదజల్లుతున్నారని అధికార వర్గాలు విమర్శిస్తున్నాయి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, అత్యుత్తమ ప్రమాణాలతో విద్యార్థులకు భోజనం అందించడమే కూటమి ప్రభుత్వ ఆశయమని మంత్రి పునరుద్ఘాటించారు. రానున్న రోజుల్లో ఈ స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టును రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించడానికి విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంతో పాటు డిజిటల్ విద్యా విధానాన్ని, పౌష్టికాహారాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా విద్యార్థుల హాజరు శాతం మరింత పెరుగుతుందని, తద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/minister-nara-lokesh-36-224402.html





