కడపలో తెలుగుదేశం మహానాడు.. అసలీ ఆలోచన ఎవరిదో తెలుసా?
Publish Date:May 27, 2025
.webp)
Advertisement
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత తొలిసారిగా ఆ పార్టీ పెద్ద పండుగ మహానాడును కడపలో నిర్వహిస్తున్నారు. మంగళవారం (మే 27)న ప్రారంభమైన మహానాడు గురువారం (మే 28) వరకూ సాగుతుంది. కడప అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. దశాబ్దాలుగా కడప వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా నిలుస్తోంది. పార్టీలూ, హవాలతో సంబంధం లేకుండా కడప వైఎస్ కు అండగా నిలుస్తూ వస్తున్నది. వైఎస్ మరణానంతరం కడప జగన్ కు కంచుకోటగా నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, విభజిత రాష్ట్రంలో కూడా గత ఏడాది జరిగిన ఎన్నికల వరకూ కడపలో వైఎస్ కుటుంబానిదే ఆధిపత్యం. అయితే ఆ అధిపత్యానికి 2024 ఎన్నికలలో గండి పడింది. కడపలోని పది నియోజకవర్గాలకు గాను ఏడింటిలో తెలుగుదేశం కూటమి విజయఢంకా మోగించింది. వైసీపీ కేవలం మూడంటే మూడు స్థానాలకు పడిపోయింది.
అయితే ఇంత కంటే ముందే కడపలో జగన్ కోటకు బీటలు వారడం మొదలైంది. అందకు బీజం లోకేష్ పాదయాత్రతో పడిందని చెప్పవచ్చు. నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో భాగంగా రాయలసీమ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఆ సందర్భంగానే జగన్ కడపకోటను బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నారు. 2024 ఎన్నికలలో నభూతో అన్న స్థాయిలో విజయాన్ని అందుకున్న తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టంది. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ కడపలో తెలుగుదేశం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా లోకేష్ అడుగులు వేశారు. వేస్తున్నారు. అందులో భాగంగానే రాయలసీమ ప్రాంతంలో ఇంధన, ఆటోమొబైల్ ప్రాజెక్టుల స్థాపన కేసం విశేష కృషి చేసి సాధించారు. వీటికి అదనంగా సాగునీటి ప్రాజెక్టులూ చేపట్టారు. దీంతో సీమ జీవన ముఖ చిత్రం మొత్తం మారిపోయే పరిస్థితికి వచ్చింది. జరుగుతున్న అభివృద్ధి, పెరుగుతున్న ఉపాధి అవకాశాల కారణంగా జనం తెలుగుదేశం పార్టీపై అభిమానం పెంచుకున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో వ్యూహాత్మకంగా పార్టీ మెగా ఈవెంట్ గా చెప్పబడే మహానాడును కడపలో నిర్వహించాలని నారా లోకేష్ ప్రతిపాదించారు. నారా లోకేష్ ప్రతిపాదనకు పార్టీ అధినేత చంద్రబాబు సహా మొత్తం క్యాడర్, లీడర్ ఆమోదముద్ర వేసింది. మహానాడు నిర్వహణతో కడప జిల్లాలో తెలుగుదేశం పట్టు పెంచుకుని బలోపేతం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని లోకేష్ గట్టిగా వాదించారు. కడపలో మహానాడు నిర్వహణ విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయం లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు కడపలో మహానాడు నిర్వహణతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందన్న విశ్వాసం పార్టీ వర్గాల్లో మెండుగా ఉంది. లోకేష్ ముందు చూపునూ, వైసీపీ కంచుకోటనే ఢీ కొని బీటలు వారేలా చేయడంలో ఆయన చూపిన ధైర్యం ఇప్పుడు కార్యకర్తల మన్ననలు అందుకుంటోంది.
http://www.teluguone.com/news/content/mahanadu-in-kadapa-39-198777.html












