దావోస్ వేదికగా చంద్రబాబులోని మరో కోణాన్ని బయటపెట్టిన లోకేష్
Publish Date:Jan 21, 2025
Advertisement
చంద్రబాబు అంటే అపర చాణక్యుడు, సంక్షోభంలో అవకాశాలు వెతుక్కుని ముందుకు సాగే వ్యూహకర్త, అపార అనుభవం ఉన్న రాజకీయవేత్త.. దార్శనికుడు అనే అందరికీ తెలుసు అయితే దావోస్ వేదికగా ఆయనలోని మరో కోణాన్ని ఆయన తనయుడు నారా లోకేష్ బయటపెట్టారు. తన తండ్రి చంద్రబాబు అంటే ఒక రాజకీయవేత్తగానే అందరికీ తెలుసు కానీ ఆయనలో ఒక వ్యాపారవేత్త ఉన్నాడని చెప్పారు. అయితే ఆ వ్యాపారవేత్త దారుణమైన నష్టాలను చవి చూశారని వెల్లడించారు. హెరిటేజ్ కు ముందు సీబీఎన్ అనుక వ్యాపారాలు చేశారనీ, వాటిలో దారుణంగా నష్టపోయారనీ చెప్పారు. అయితే నష్టాలకు వెరవకుండా ఆయన ముందుకే సాగారన్న లోకేష్ చివరకు హెరిటేజ్ ను స్థాపించారని వివరించారు. ఇప్పుడు హెరిటేజ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. అదే విధంగా ఆయన రాజకీయాలలోనూ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా అనేక ప్రయోగాలు చేశారనీ, భవిష్యత్ ను ముందుగానే దర్శించిన దార్శనికుడని చెప్పిన లోకేష్.. తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో రాణిస్తున్నారంటే అందుకు అప్పట్లో ఆయన విద్యావిధానంలో తీసుకువచ్చిన మార్పులే కారణమన్నారు. దావోస్ లో సోమవారం (జనవరి 20) నుంచి ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం వెళ్లిన నారా లోకేష్ జ్యూరిల్ లో తెలుగు పారిశ్రామిక వేత్తల సదస్సులో ప్రసంగించారు. ఈ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచీ దాదాపు 180 మంది తెలుగు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. వీరిలో మహిళా పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారు. వీరిని ఉద్దేశించి చేసిన తన ప్రసంగంలో ఆయన ఇక్కడ ఇంత మంది తెలుగు వారిని చూస్తుంటే ఆనందంగా ఉంది.. అసలు జ్యూరిచ్ లో ఉన్నానా.. జువ్వలపాలెంలో ఉన్నానా అన్న ఆశ్చర్యం కలుగుతోందని చమత్కరించారు.
ఇక వైసీపీ హయాంలో అన్ని విధాలుగా భ్రష్ఠుపట్టిన ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు గాడిలో పెడుతున్నారనీ, ప్రస్తుతం రాష్ట్రం కష్టాల నుంచి గట్టెక్కి అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందనీ చెప్పిన నారా లోకేష్.. ఇప్పుడు రాష్ట్రానికి మీరంతా సహకారం అందిచాలన్నారు. పెట్టుబడులకు ఏపీ స్వాగతం పలుకుతోందనీ, మీరంతా స్పందించి ముందుకు రావాలని కోరారు.
http://www.teluguone.com/news/content/lokesh-reveals-another-angle-in-cbn-39-191612.html





