ఉన్నత విద్యావంతుల్ని తెలివిగా వాడుకున్న లిక్కర్ స్కాం నిందితులు
Publish Date:Jul 26, 2025
Advertisement
ఉన్నత విద్యనభ్యసించి, మంచి భవిష్యత్తు వెతుక్కుంటున్న అమాయకులను కూడా మాజీ సీఎం జగన్ సన్నిహితులు లిక్కర్ స్కాంలో బుక్ చేస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ -47 నిందితుడిగా ఉన్న బెహ్రూన్ షాజిల్ షేక్ పాపం అలాగే కేసులో ఇరుక్కున్నాడు. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు అయిన ఏ1 రాజ్ కసిరెడ్డి ప్రణాళిక అమలు కోసం నియమించుకున్న విద్యావంతులైన యువకుల్లో షాజిల్ షేక్ ఒకడు. అతను తాజాగా సిట్ విచారణకు హాజరయ్యాడు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక తన దగ్గర పెట్టిన డబ్బులు రాజ్ కేసిరెడ్డి అనుచరులు తీసుకుని, తనను దుబాయ్కి వెళ్లిపొమ్మన్నారని, తాను అక్కడే ఉద్యోగం చేసుకుంటున్నానని, తనకు లిక్కర్ స్కామ్తో సంబంధం లేదనీ.. రాజ్ కసిరెడ్డి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధం చేసిన ఎలట్రిక్ వాహన డిజైన్లో పనిచేసిన ఇంజనీర్ను మాత్రమేనని సిట్ అధికారులకు లిక్కర్ స్కామ్ నిందితుడు బెహ్రూన్ షాజిల్ షేక్చెప్పినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. నెల్లూరు జిల్లాకు చెందిన షాజిల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ కంట్లో పడ్డాడు. లిక్కర్ స్కామ్లో వసూలు చేసిన కమీషన్ల నుంచి రాజ్ కసిరెడ్డి కొంత నొక్కేశాడు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులతో పాటు విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభించాడు. మరోవైపు మనదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రికల్ ఆటో రంగంలోకి ప్రవేశిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఈవీ వాహనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఐప్యాక్ బృందంలోని కీలక వ్యక్తి భార్యను సీఈవోగా నియమించి ఈవీ బ్యాటరీ, వాహన డిజైన్తో పాటు కేంద్ర రవాణ మంత్రిత్వ శాఖ అనుమతులన్నీ పొందాడు. అందుకు భారీగా సొమ్ము ఖర్చు చేసిన రాజ్ కసిరెడ్డి లిక్కర్ ముడుపుల నుంచి నగదు రూపంలో ఎప్పటికప్పుడు ఈవీ వాహన ఆర్ అండ్ డీ కోసం వినియోగించాడు. డిజైన్ రూపకల్పనలో ఇంజనీర్గా పనిచేసిన బెహ్రూన్ షాజిల్ ఎన్నికల ముందు వరకూ హైదరాబాద్లో ఉన్నాడు. నమ్మకస్తుడిగా ఉండటంతో రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ సభ్యులు లిక్కర్ ముడుపులను అప్పుడప్పుడు అట్ట పెట్టెల్లో తెచ్చి బెహ్రూన్ ఫ్లాట్లో పెట్టేవారు. ఈవీ అవసరాల కోసం కొంత ఇచ్చి, మిగతా సొమ్ము తీసుకెళ్లేవారు. సిట్ అధునాతన టెక్నాలజీ సాయం తో మొత్తం మూలాలు వెలికి తీస్తోంది. మద్యం ముడుపుల వసూలు నిందితులు పలుమార్లు హైదరాబాద్లోని బెహ్రూన్ ఫ్లాట్కు వెళ్లినట్లు విచారణలో గుర్తించింది. కూపీ లాగడంతో అక్కడ ముడుపుల సొమ్ము భద్రపరిచే వారని తేలింది. దీంతో బెహ్రూన్ షేక్ను లిక్కర్ స్కామ్లో నిందితుడిగా చేర్చింది. సిట్ అతని ఆచూకీ కోసం చేసిన ప్రయత్నం ఫలించింది. దుబాయ్లో ఉంటున్నట్లు తెలుసుకుని విచారణకు రమ్మని పిలవడంతో శుక్రవారం విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చాడు. లిక్కర్ స్కామ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజ్ కసిరెడ్డి ఈవీ వాహనం కోసమే పని చేశానని చెప్పిన బెహ్రూన్ అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సిట్ అధికారులకు అందజేసినట్లు తెలిసింది. స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న సిట్ అధికారులు తమకు అందుబాటులో ఉండాలని చెప్పి పంపినట్లు సమాచారం. తన కుటుంబం దుబాయ్లో ఉంటోందని, ఈ స్కామ్లో తాను చిక్కుకుంటానని అనుకోలేదంటూ నిందితుడు వాపోయినట్లు తెలిసింది.
http://www.teluguone.com/news/content/liquor-scam-accused-cleverly-used-highly-educated-people-39-202772.html





