లడ్డూ అంశంపై పవన్, ప్రకాష్ డైలాగ్ వార్!
Publish Date:Sep 24, 2024
Advertisement
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన అంశం మీద కేవలం తెలుగు రాష్ట్రాల్లోని వారు మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మాన్ని అనుసరించేవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆవేదనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర మనోవేదన చెంది ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేస్తూ, 'మీరు డిప్యూటీ సీఎంగా వున్న రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. విచారణ చేపట్టి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోండి. భక్తులకు అనవసర భయాలు కల్పించి... దీనిని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా ఎందుకు చేస్తున్నారు? మన దేశంలో ఇప్పటికే వున్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు' అని అన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. విజయవాడ కనకదుర్గ దేవాలయంలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, సున్నితమైన అంశాల మీద ప్రకాష్రాజ్ తెలుసుకుని మాట్లాడాలని అన్నారున. ప్రకాష్రాజ్తో పాటు అందరికీ చెబుతున్నానని, విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని సూచించారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్రాజ్ ఒక వీడియో సందేశం ద్వారా స్పందించారు. తాను చెప్పిన విషయాన్ని పవన్ కళ్యాణ్ అపార్థం చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను విదేశాల్లో సినిమా షూటింగ్లో ఉన్నానని, ఈ నెల 30 తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని అన్నారు ఈలోగా పవన్ కళ్యాణ్ తన ట్వీట్ను మరోసారి చదివి అర్థం చేసుకోవాలని కోరుతున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్ వీడియో సందేశానికి జనసేన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ప్రతిస్పందన వచ్చింది. డియర్ ప్రకాష్రాజ్ గారూ... 1. మీ ట్వీట్ను మేము సరిగానే అర్థం చేసుకున్నాం, డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టే ఈ అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలో చర్చించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ‘సిట్’ ఏర్పాటు చెయ్యడం జరిగింది. 2. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధమైన చర్య జరిగినప్పుడు ఇది ప్రతీ ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలి. కోట్లాది హిందువులతో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె తో తయారు చేసిన లడ్డూ తినేలా చేసినప్పుడు, ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిందే. 3. ఎక్కడైనా ఇతర మతాల వారిమీద ఘటనలు జరిగితే దేశంలో సెక్యులరిజం లేదు అని గగ్గోలు పెట్టే మీరు, 100 కోట్లకు పైగా హిందువుల విశ్వాసాలు దెబ్బతీసిన ఘటనపై దేశం స్పందించకుండా ఉండాలి అంటే ఎలా? 4. దేశంలో ఎన్నో గొడవలు ఉన్నాయి అంటున్నారు, వాటిలో మీకు ఒక వర్గానిదే తప్పు అన్నట్లుగా మీకు కనిపిస్తుంది, కారణాలు మీ రాజకీయ విధానాలు కావచ్చు, మాకు అనవసరం. ఇది హిందువుల మత విశ్వాసాలకు సంబంధించిన విషయం. మీకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం అర్ధం అవుతుంది అని అనుకుంటున్నాను. 5. సమస్య ఎవరిదైనా సరే గొంతెత్తి రాజకీయాలకు అతీతంగా మాట్లాడిన వ్యక్తి గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ విషయం వ్యక్తిగతంగా మీకు తెలుసు అని భావిస్తున్నాము. 6. బహుశా నేపాల్లో ఉన్నట్లున్నారు. అక్కడ హిందువులను ఒకసారి ఈ ఘటన గురించి స్పందన అడగండి, మీకు అర్థం అవుతుంది. దయచేసి కేంద్ర నాయకత్వంతో మీకు ఉన్న వ్యక్తిగత ద్వేషాన్నిఅందరిపై రుద్దాలని చూడకండి.... అని స్పందించారు.
http://www.teluguone.com/news/content/laddu-issue-chandrababu-39-185502.html





