కుప్పం ఇక ఇండస్ట్రియల్ హబ్..చంద్రబాబు విజన్కు మరో అడుగు..!
Publish Date:Jul 3, 2026
Advertisement
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం ఆయన నేరుగా కుప్పం చేరుకుని గుడుపల్లె మండలం పొగురుపల్లెలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.200 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్తో పాటు APIIC ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఎంఎస్ఎంఈ పార్క్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ రెండు ప్రాజెక్టులు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రైతులకు స్థిరమైన మార్కెట్ను అందించనున్నాయి. 30.75 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ యూనిట్ను సందర్శించిన సీఎం ప్లాంట్ కార్యకలాపాలను పరిశీలించారు. వివిధ విభాగాల పనితీరును సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు. సంస్థ నిర్వహించిన జాబ్ ఫెయిర్లో ఎంపికైన యువతకు ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ నెల నుంచే వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానున్న ఈ యూనిట్ ద్వారా మొత్తం 1,400 మందికి ఉపాధి లభించనుండగా, అందులో 700 ప్రత్యక్ష, 700 పరోక్ష ఉద్యోగాలు ఉన్నాయి. తొలి దశలోనే 300 నుంచి 400 మంది యువతకు ఆఫర్ లెటర్లు అందజేశారు. ఈ పరిశ్రమ ద్వారా స్థానిక పౌల్ట్రీ రైతులకు గిట్టుబాటు ధరలతో మార్కెట్ లభించడంతో పాటు ఒప్పంద పద్ధతిలో కోళ్ల పెంపకానికి అవకాశాలు విస్తరించనున్నాయి. ఫీడ్ సరఫరా, రవాణా, అనుబంధ రంగాలకు కూడా ఈ యూనిట్ ఊతమివ్వనుంది. అనంతరం 44.58 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన APIIC ఎంఎస్ఎంఈ పార్క్ను సీఎం ప్రారంభించారు. ఈ పార్కులో ఏర్పాటు చేసిన 167 పారిశ్రామిక ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను జూలై నెల నుంచే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు ఒకేచోట అందుబాటులో ఉండటం వల్ల కొత్త పెట్టుబడులు ఆకర్షితమై, స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కుప్పాన్ని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దడంలో ఈ పార్క్ కీలక పాత్ర పోషించనుంది. ఇక 7,489 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా రూ.28 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన రూఫ్టాప్ సోలార్ ప్రాజెక్టును కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. అదేవిధంగా కనమానపల్లి, గంగాపురం, టీ సముద్రం, కృష్ణానగర్, బళ్ల గ్రామాల్లో రూ.25 కోట్లతో నిర్మించిన రెస్కో సంస్థకు చెందిన ఐదు సబ్స్టేషన్లను ప్రజలకు అంకితం చేశారు. కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రికి ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పొగురుపల్లెకు వెళ్తున్న మార్గమంతా గ్రామస్తులు హర్షధ్వానాలతో స్వాగతించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “కుప్పం నియోజకవర్గ చరిత్రలో ఇవాళ ప్రత్యేకమైన రోజు. ఏబీఐఎస్ ప్రోటీన్స్ సంస్థ ఇప్పటికే వందలాది మందికి ఉపాధి కల్పించింది. అత్యాధునిక సాంకేతికతతో దేశంలోనే అతిపెద్ద చికెన్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఒకటిని ఏర్పాటు చేయడం సంతోషకరం. దీనివల్ల స్థానిక రైతులకు, కోళ్ల పెంపకందారులకు, యువతకు ప్రయోజనం చేకూరుతుంది. తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన సంస్థ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను” అని అన్నారు. “కుప్పానికి రైలు, రోడ్డు, విమాన అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు పరిశ్రమలను తీసుకొస్తున్నాం. అయితే వస్తున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన వర్క్ఫోర్స్ కూడా సిద్ధం కావాలి. స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పరిశ్రమలు తీసుకురావడం నా బాధ్యత అయితే, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించడం ప్రజల బాధ్యత” అని సీఎం పేర్కొన్నారు. “పరిశ్రమలు, సేవారంగం, వ్యవసాయ రంగాల అభివృద్ధితో కుప్పాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాం. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. నైపుణ్యాలను పెంపొందించుకుని వినూత్న ఆలోచనలతో ముందుకు సాగితే అపార అవకాశాలు సృష్టించుకోవచ్చు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/kuppam-industrial-development-36-225000.html





