జగన్కు దమ్ముంటే కాపు నేతల్లో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి : కిరణ్ రాయల్
Publish Date:Jun 23, 2026
Advertisement
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే ఇటీవల సమావేశమైన ఐదుగురు కాపు నేతల్లో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ సవాల్ విసిరారు. అలా ప్రకటిస్తే తాను స్వయంగా వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాలు కులాల చుట్టూ తిరగడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం 25 నుంచి 27 శాతం వరకు ఓటు బ్యాంక్ కలిగి ఉందని, ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపుల మద్దతు కీలకమని అన్నారు. కాపు సామాజిక వర్గం మద్దతుతోనే కూటమి ప్రభుత్వం 164 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. అయితే, కాపు వర్గాన్ని వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పావులుగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగే ప్రతి ఘటనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను బాధ్యుడిగా చూపించడం సరికాదని కిరణ్ రాయల్ అన్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబు, కన్నబాబు, అమర్నాథ్, బొత్స సత్యనారాయణ సమావేశం వెనుక జనసేన, కూటమిని బలహీనపరిచే రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని ఆరోపించారు. జగన్ నిజంగా కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలనుకుంటే ఆ ఐదుగురు నేతల్లో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని, లేదా ఐదుగురికి ఒక్కో ఏడాది చొప్పున ముఖ్యమంత్రి పదవిని పంచాలని సూచించారు. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా వారికి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తానని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వంగవీటి రాధాను రాజకీయంగా నయవంచన చేసి గ్రూపు రాజకీయాలకు తెరతీశారని, అదే విధానాన్ని జగన్ కొనసాగిస్తూ కాపు సామాజిక వర్గాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి తీరుపై కూడా కిరణ్ రాయల్ తీవ్ర విమర్శలు చేశారు. రూ.300 చొప్పున చెల్లించి పెయిడ్ ఆర్టిస్టులతో నిరసనలు చేయించడం భూమనకు అలవాటైందని ఆరోపించారు. తిరుపతిలో భూమన కుటుంబం అనేక శాఖలకు మంత్రుల్లా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. అభినయ్ రెడ్డి అనుచరుడిగా చెప్పబడుతున్న చైతన్య యాదవ్ అరాచక శక్తిగా మారాడని, వడ్డీ వ్యాపారాలు నిర్వహించాడని ఆరోపించారు. కాపులంటే భూమనకు భయం ఉందని, చిన్న అంశాన్నైనా పెద్దదిగా చూపిస్తూ పెయిడ్ ఆర్టిస్టులతో రాజకీయ డ్రామాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఓట్లు రాకపోవడంతో కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోందని, దీనికి భూమన కరుణాకర్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారని కిరణ్ రాయల్ ఆరోపించారు.
http://www.teluguone.com/news/content/kiran-royal-36-223951.html




