కేంద్రంతో తాడో పేడో.. టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం
Publish Date:Jul 16, 2022
Advertisement
కేంద్రంపై పోరు బాటను వీడేదేలే అంటున్నారు కేసీఆర్. కేంద్రంపై ఆయన పూరించిన శంఖారావానికి కదిలి వచ్చిన పార్టీలేవీ లేకపోయినా.. నిరాశ దరికి రానీయకుండా ముందుకే సాగుతున్నారు. ఇప్పటి వరకూ మీడియా సమావేశాలు, సభలకే పరిమితమైన టీఆర్ఎస్ పోరు ఇప్పుడు పార్లమెంటు వేదికగా మోడీతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది.సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో కేంద్రం విధానాలపై పోరును తారస్థాయికి తీసుకువెళ్లాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన శనివారం జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణకు నిధులు కేటాయింపు విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ చూపుతున్నవివక్షపై గట్టిగా గళమెత్తాలని ఆదేశించారు. ప్రతీ విషయంలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందంటున్న కేసీఆర్ కేవలం తెలంగాణ విషయమే కాకుండా.. ప్రజలను మతం పేరుతో రెచ్చగొడుతూ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పార్లమెంటులో బీజేపీయేతర పార్టీల సభ్యులను కూడా కలగలుపుకుని నిరసనను తీవ్రంగా వ్యక్తం చేయాలని తెరాస ఎంపీలకు సూచించారు. కేంద్రంపై టీఆర్ఎస్ పోరు కేంద్రంలో మోడీ సర్కార్ గద్దె దిగే వరకూ కొనసాగుతూనే ఉంటుందని, ఈ విషయంలో వెనకడుగు ప్రశక్తే లేదనీ స్పష్టం చేసిన కేసీఆర్, అందులో భాగంగానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో టీఆర్ఎస్ విమర్శల వాడి వేడిని కేంద్రానికి తెలియజేయాలని సూచించారు. పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాల్సిన పలు అంశాలపై వారికి సూచనలు చేశారు. రాష్ట్ర పతి ఎన్నికలో యశ్వంత్ సిన్హాకే బీజేపీయేతర పార్టీల ఎంపీల ఓట్లు పడేలా చూడాలని కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలను ఆదేశించాు. సమస్యలపై, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని నిలదీసే విషయంలో విపక్ష పార్టీల సభ్యుల మద్దతు కూడగట్టాలని సూచించిన కేసీఆర్ అందు కోసం ఇప్పటికే టీఎంసీ అధినేత మమతా బెనర్జీతో కేసీఆర్ పోన్లో సంప్రదించారు. గత సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలో ధాన్యం కొనుగోలుపై ఆందోళన చేశారు. అయితే ఆ తరువాత కేంద్రం ముడి బియ్యం తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో కేంద్రం వైఖరిని నిరసిస్తూ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. గతంలోలా ఇప్పుడు సమావేశాల బహిష్కరణ కాకుండా సభలో ఉంటూనే అవసరమైతే సభా కార్యక్రమాలను స్తంభింప చేసైనా సరే తెలంగాణ వాణిని దేశ వ్యాప్తంగా వినిపించాలని కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.
http://www.teluguone.com/news/content/kcr-directs-party-mps-to-fight-for-telangana-cause-in-parliament-25-139924.html





