తొందరపడి ఓ కోయిలా ముందే కూస్తోందా?.. ప్లీనరీ వేదికగా జగన్ అభ్యర్థుల ప్రకటన
Publish Date:Jun 21, 2022
Advertisement
వైసీపీ ప్లీనరీ వేదికగా జగన్ సంచలన ప్రకటన చేయబోతున్నారా? అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించడమే ఆ సంచలన ప్రకటనా అంటే పార్టీ శ్రేణులు ఔననే అంటున్నాయి. ఒక వైపు ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటూనే.. మరో వైపు విపక్షాలపై ఒత్తిడి పెంచేలా వ్యూహాలు, ప్రణాళికలకు పదును పెడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ప్లీనరీ వేదికగా సంచలన ప్రకటన చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల బరిలో నిలిపే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను పార్టీ ప్లీనరీ వేదికగా జగన్ ప్రకటిస్తారని పార్టీ వర్గాల సమాచారం. నిజానికి జగన్ ఈ ఏడాది తెలుగు సంవత్సరాది ఉగాది నుంచే కార్యాచరణ మొదలుపెట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, పార్టీ పదవులు ఖరారు చేయడంతో పాటు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ద్వారా ఎమ్మెల్యేలను జనంలోకి పంపారు. అది విఫలమయ్యేసరికి సామాజిక న్యాయభేరి అంటూ మంత్రుల బస్సుయాత్ర చేయించారు. అదీ విఫలమైనా జగన్ తగ్గేదేలే? అన్నట్లుగా పార్టీ ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు. మళ్లీ అధికారమే లక్ష్యంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ జగన్ సింగిల్ పాయింట్ అజెండాతో ఎన్నికలకు, కొత్త ఎత్తులతో కదులుతున్నారు. ఇప్పుడెలా ఉన్నా.. ఎన్నికల సమయానికి జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో టీడీపీ- జనసేన ఏకం అవుతాయని వైసీపీ భావిస్తోంది. ఎన్నికలకు తాము సిద్ధమని చెబుతూనే.. వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికలకు అభ్యర్ధులను ప్రకటించి, ప్రతిపక్షాలపై ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేయాలని జగన్ భావిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో కూడా ఇడుపులపాయ వేదికగా ఒకేసారి ఎంపీలు, ఎమ్మెల్యేల జాబితాను జగన్ ప్రకటించారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల పని తీరుపై పలు కోణాల్లో నియోజకవర్గాల్లోని ప్రజల నుంచి అభిప్రాయం సేకరిస్తున్నారు. ప్రజలు, పార్టీ పట్ల వారి పనితీరు, వచ్చిన నివేదికల ఆధారంగా మార్కులు కేటాయిస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకొని టిక్కెట్ల ఖరారులో తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల భోగట్టా. ఎన్నికలకు ఆరు నుంచి 10 నెలల ముందే అభ్యర్ధులను ప్రకటించేందుకు జగన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారనీ, తద్వారా అభ్యర్ధులను ఇప్పటి నుంచే ప్రజలకు దగ్గర చేసి, ఎన్నికల సమయానికి వారు ప్రజలతో మమేకం అయ్యేలా చూడాలన్నదే జగన్ వ్యూహమని అంటున్నారు. దీంతో పొత్తుల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న ప్రతిపక్షాలపై ఒత్తిడి పెంచటంతో పాటు టిక్కెట్లు ఎవరికో తేల్చేయటం ద్వారా అభ్యర్ధులకు ప్రచారానికి, ప్రజలకు దగ్గరవ్వటానికి తగినంత సమయం దొరుకుతుందని విశ్లేషిస్తున్నారు. ఈ సారి టిక్కెట్లు ఇవ్వలేకపోయే వారికి ముందుగానే స్పష్టత ఇచ్చి వారి సేవలను ఎన్నికల వేళ పార్టీకి వినియోగించుకోవటం, పార్టీ అధికారంలోకి వస్తే కీలక బాధ్యతలు ఇచ్చేలా ముందస్తు హామీ ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్లీనరీ వేదికగా వచ్చే ఎన్నికలపైన కీలక ప్రకటనతో పాటు 2019 ఎన్నికల హామీలు, 2024లో చేయబోయే కార్యక్రమాలపైన ముందుగానే జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే 2019 ఎన్నికలలో జగన్ పార్టీ విపక్షంలో ఉందనీ, అప్పటి వరకూ ఒక్కసారి కూడా ఆ పార్టీ అధికారం చేపట్టలేదనీ.. అందుకే అభ్యర్థుల జాబితాను ఒకే సారి ముందుగానే ప్రకటించినా అసమ్మతి, అసంతృప్తి బెడద పెద్దగా లేదనీ, ఇప్పుడలా కాదనీ, మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణతో పార్టీలో భగ్గు మన్న అసమ్మతిని గమనిస్తే.. ప్లీనరీ వేదికగా జగన్ అభ్యర్థుల జాబితా ప్రకటించడమంటూ జరిగితే.. పార్టీలో అసమ్మతి జ్వాలలు ఒక్కసారిగా ఎగసి పడటం ఖాయమనీ.. అప్పుడు ముందే కూసిన కోయిలలా జగన్ చిక్కుల్లో పడటం ఖాయమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-likely-to-announce-candidates-from-the-dias-of-plenary-25-138135.html





