జగన్, షర్మిల ఎడతెగని ఆస్తుల పంచాయతీ..!
Publish Date:Dec 13, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన సొంత చెల్లి షర్మిలతో ఆస్తుల పంచాయతీ ఎడతెగకుండా సాగుతోంది. ఈ ఆస్తుల పంచాయతీలో జగన్, ఆయన భార్య భారతీ రెడ్డీ ఒక వైపు ఉంటే.. షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ నిలిచారు. ముఖ్యంగా సరస్వతి పవర్ కంపెనీ షేర్ల విషయంలో వివాదం హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) కు ఎక్కింది. ఇరు వర్గాలూ అంటే జగన్ , భారతీ, విజయమ్మ, షర్మిలలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ కేసులో ఎన్సీఎల్టీలో ఎప్పటికప్పుడు విజయమ్మ, జగన్ లు పిటిషన్లు, కౌంటర్లు దాఖలు చేసుకుంటున్నారు. ఒకరు ముందు దాఖలు చేసిన పిటిషన్ పై మరొకరు కౌంటర్ దాఖలు చేస్తున్నారు. దానినీ కౌంటర్ చేస్తూ మళ్లీ పిటిషన్లు, కౌంటర్లు దాఖలు అవుతున్నాయి. తాజాగా జగన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి షర్మిల దెబ్బతీయాలని ప్రయత్నించిందంటూ ఎన్సీఎల్టీకి నివేదిక అందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో చెల్లితో చేసుకున్న ఆస్తుల ఒప్పందాలను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తన కౌంటర్లో పేర్కొన్నారు. వివాదానికి కారణమైన ఆస్తులన్నీ తన స్వార్జితమని పేర్కొంటూ జగన్ ఎన్సీఎల్టీలో సమగ్ర కౌంటర్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వాటాల బదిలీ అంశంపై గతంలో వైఎస్ జగన్, వైఎస్ భారతి ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తమకు చెందిన షేర్లను అక్రమంగా తల్లి వైఎస్ విజయమ్మ బదిలీ చేశారని ఆరోపిస్తూ, ఆ షేర్ల బదిలీని రద్దు చేయాలని వారు కోరారు. ఈ పిటిషన్పై వైఎస్ షర్మిల అప్పీల్ చేయడంతో, ఆమెకు ఈ వ్యవహారంలో ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేవనీ, . అప్పీల్ చేసే అర్హత కూడా షర్మిలకు లేదని జగన్ తన కౌంటర్లో పేర్కొన్నారు. చెల్లిపై ఉన్న ప్రేమాభిమానాలతో గతంలో భవిష్యత్తులో ఆస్తులు బదిలీ చేయాలనే ఉద్దేశంతో ఒప్పందం కుదిరిందని పిటిషన్ లో పేర్కొన్న జగన్.. అయితే ఆ మేరకు జరిగిన వాటాల బదిలీకి మూడేళ్లు పూర్తైనప్పటికీ, ఇంతకాలం మౌనంగా ఉన్న షర్మిల ఇప్పుడు అప్పీల్ చేయడం వెనుక ఉద్దేశాలపై సందేహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ, తన వాదనలను ట్రిబ్యునల్ ముందు జగన్ ఉంచారు.
http://www.teluguone.com/news/content/jagan-and-sharmila-unending-property-dispute-36-210961.html





