జగన్ తీరు.. వైసీపీ బేజారు.!
Publish Date:Aug 10, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లయ్యింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సమన్వయంతో ముందుకు సాగుతోంది. క్షేత్రస్థాయిలో కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు, శ్రేణుల మధ్య ఏవైనా ఇబ్బందులూ, విభేదాలూ పొడసూపినా.. అగ్రనాయకత్వం జాప్యం లేకుండా జోక్యం చేసుకుని, అవి మరింత ముదరకుండా చర్యలు తీసుకుంటోంది. మరో వైపు 2024 ఎన్నికలలో 11 సీట్లకే పరిమితమైన ఘోర పరాజయం పాలైన వైసీపీ ఈ రెండేళ్లలోనూ ఇసుమంతైనా కోలుకున్నట్లు కనిపించదు. అందుకు ప్రధాన కారణం.. ప్రజలు తిరస్కరించినా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా, ఆ హోదా కోసం నానాయాగీ చేస్తూ, మంకుపట్టుపట్టి ప్రజల దృష్టిలో మరింత చులకల అయ్యింది. ప్రతిపక్ష హోదా కోసం అభ్యర్థించడం, డిమాండ్ చేయడం, చివరకు కోర్టుకు కూడా వెళ్లి జగన్ వృధా ప్రయత్నాలు చేశారు. చివరకు విపక్ష హోదా కోసం అలిగి అసెంబ్లీ బాయ్ కాట్ చేశారు. ఈ రెండేళ్ల కాలంలో జగన్ రెండు మూడు సార్లు వినా అసెంబ్లీకి వెళ్లింది లేదు. జగన్ మాత్రమే కాదు.. ఆయనతో సహా వైసీపీ ఎమ్మెల్యేలెవరూ అసెంబ్లీ ముఖం చూడటం లేదు. కేవలం అహంభావంతో ఆయన విపక్ష హోదా కోసం పట్టుబట్టి అసెంబ్లీకి ముఖం చాటేసి పార్టీకి మరింత నష్టం చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏం చేసినా ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా, వైపీ ప్రతిపక్ష పార్టీ గుర్తింపు దక్కే అవకాశాలు ఇసుమంతైనా లేవని విస్పష్టంగా చెబుతున్నారు. ఇక వైసీపీలో విషయ జ్ణానం ఉన్న వారందరికీ కూడా ఈ వ ిషయం తెలిసినప్పటికీ ఆ సంగతిని జగన్ కు చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారని పరిశీలకులు అంటున్నారు. అంతెందుకు జగన్ మద్దతు దారు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా విపక్ష హోదా కోసం జగన్ తాపత్రేయపడటం శుద్ధ వేస్టని కుండబద్దలు కొట్టేశారు కూడా. ఎంత పాకులాడినా ఆయనకు విపక్ష నేత హోదా వచ్చే అవకాశం లేదనీ, ఆ విషయంలో జగన్ చేస్తున్నదంతా వృధా ప్రయాసేనని గతంలోనే కుండబద్దలు కొట్టేశారు. రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు. అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు. ఆయన తీరు ఇలాగే ఉంటే.. రాష్ట్రంలో పార్టీ ఉనికి మాత్రంగా మిగిలే అవకాశం కూడా ఉండదనీ, ఈ విషయాన్ని జగన్ ఎంత త్వరగా గుర్తిస్తే ఆయనకు రాజకీయంగా అంత మేలు జరుగుతుందని అంటున్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కనుకే తాను అసెంబ్లీకి రావడం లేదని జగన్ అంటున్నా.. సీఎంగా చక్రం తిప్పిన అసెంబ్లీలో ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యేగా కూర్చోవడానికి జగన్ కు అహం అడ్డొస్తోందనీ, ఆ కారణంగానే ఆయన అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తమౌతోంది. . ఇక ప్రస్తుతానికి వస్తే..రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయి రెండేళ్లయ్యింది. ఈ రెండేళ్లలో జగన్ ప్రజాక్షేత్రంలోకి వచ్చింది లేదు. బెంగళూరు ప్యాలెస్ కు పరిమితమై ఏదో చుట్టపు చూపుగా ఏపీకి వస్తున్నారు. అలా వచ్చి కూడా ప్రెస్ మీట్ లకే పరిమితమై ప్రజలకు దూరంగానే ఉంటున్నారు. అధవా బయటకు వచ్చినా.. పరామర్శ యాత్రల పేర బల ప్రదర్శన చేస్తున్నారు. ఆయన బయటకు వచ్చిన ప్రతి సారి ఏదో ఒక సమస్యతో పార్టీ, శ్రేణులూ చిక్కుల్లో పడుతున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమౌతోంది. అయినా.. పార్టీ నాయకులు బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహించమని జగన్ అప్పుడప్పుడు పిలుపునిస్తున్నారు. అయితే సమస్య ఏంటంటే.. జగన్ స్వయంగా పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలలో ఆయన పాల్గొనరు. దీంతో వైసీపీ నిరసనలు తూతూమంత్రంగానే మిగిలిపోతున్నాయి. జగన్ క్షేత్రస్థాయిలోకి రాకుండా ఆ పార్టీ పుంజుకునే అవకాశాలు దాదాపు మృగ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా అంటే ఘోర పరాజయానికి రెండేళ్లు పూర్తయిన తరువాతైనా వాస్తవం గ్రహించి అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతారేమో అన్ని చిన్న ఆశ ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లో నిన్నమొన్నటి వరకూ ఉండేది. కానీ సోమవారం (ఆగస్టు 10) నుంచి ఆరంభమైన అసెంబ్లీ సమావేశాలకు కూడా జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజర్ కావడంతో ఆ ఆశ కూడా అడుగంటి పోయింది. క్షేత్రస్థాయిలోనూ, అసెంబ్లీలోనూ జగన్ లేకపోవడంతో.. ఈ రెండేళ్లలో వైసీపీ రాష్ట్రంలో పట్టు కోల్పోయింది. జగన్ ఇప్పటికైనా వాస్తవం గ్రహించి తీరు మార్చుకోకుంటే.. తమ రాజకీయ భవిష్యత ఏమిటి? అన్న బెంగ వైసీపీయులలో కనిపిస్తోంది. Jagan, AP Assembly Sessions, YCP, Jagan Assembly Attendance, AP Politics, Teluguone
http://www.teluguone.com/news/content/jagan-45-228594.html




