ఇటలీ జంట హిందూ పెళ్లి
Publish Date:Dec 7, 2022
Advertisement
హిందూ వివాహాలకు ఉంటే ఆకర్షణ, విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాశ్చ్యాత్య దేశాల వారు కూడా హిందూ వివాహ సాంప్రదాయం అంటే ఎంతో మక్కువ చూపుతారు. ఇంత వరకూ హిందూ వధువు, విదేశీ వరుడు లేదా హిందూ వరుడు, విదేశీ వధువు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు చేసుకున్న సంఘటనల గురించి విన్నాం, చూశాం. అయితే ఒక ఇటలీ జంట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని అందుకోసం ఇండియా వచ్చారు. ప్రేమకు చిహ్నంగా నిలిచే తాజ్ మహల్ వద్ద మనువాడారు. అయితే వారేమీ కొత్త జంట కాదు.. ఎప్పుడో 40 ఏళ్ల కిందట వారి సంప్రదాయం ప్రకారం ఇటలీలో వివాహం చేసుకున్నవారే. అయితే హిందూ వివాహంలోని ప్రతి ఘట్టం వెనుకా ఒక శాస్త్రీయ, హేతుబద్ధ కారణం ఉంటుందని వారు విశ్వసించారు. ఎలాగైనా సరే హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా వారి కోరిక ఈడేరడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. వారికి ఇటలీలో వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగిన నాలుగు దశాబ్దాల తరువాత వారికి భారత్ రావడానికి వెసులుబాటు చిక్కింది. ఇక్కడకు రావడంతోనే వారు హిందూ సంప్రదాయం ప్రకారం ప్రేమ చిహ్నమైన తాజ్ మహల్ వద్ద వివాహం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. తన 40వ పెళ్లి వార్షికోత్సవాన్ని వారు భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం ద్వారా సెలిబ్రేట్ చేసుకున్నారు. ఆ జంట మౌరో, స్టోఫానియా. ఇరువురూ భారత సంప్రదాయ దుస్తులు ధరించి తాజ్ మహల్ సందర్శించారు. అక్కడ సంప్రదాయ బద్ధంగా మళ్లీ పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నారు. ఇటలీలో వివాహం చేసుకున్నా... తమ ఇద్దరికీ కూడా ఇండియాలో, ఇండియన్ కల్చర్ ప్రకారం పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉండేదనీ, ఆ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి ఇన్నేళ్లుగా ప్లాన్ చేస్తూనే ఉన్నామనీ, ఇప్పటికి ఆర్థికంగా భారత్ వచ్చి మనువాడేందుకు తగిన స్థితిమంతులమయ్యాకా, తమ 40వ వెడ్డింగ్ యానివర్సిరీని ఇలా సెలబ్రేట్ చేసుకుని చిరకాల వాంఛ నెరవేర్చుకున్నామని ఆ జంట చెప్పింది.
http://www.teluguone.com/news/content/italy-couple-celebrated-their-40th-marriage-anniversary-in-hindu-culture-39-148219.html