ముందస్తు ముచ్చట ఇక ముగిసినట్టేనా?
Publish Date:Jul 16, 2022
Advertisement
ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారా? వరసగా మూడవసారి ముఖ్యమంత్రి అవుతారా? అంటే, ఎవరి విషయం ఎలా ఉన్నా, మంత్రి కేటీఆర్ మాత్రం, అనుమానమే లేదు, ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారు, మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని చాలా ధీమాగా ఉన్నారు. అంతే కాదు, మా సర్వేలే కాదు, కాంగ్రెస్, బీజేపీ సుర్వేలు కూడా అదే చెపుతున్నాయని, కేటీఆర్ చెప్పుకొచ్చారు. గత మూడు నాలుగు రోజులుగా, రాష్ట్రంలో సాగుతున్న సర్వేల సంవాదానికి ముక్తాయింపు అన్నట్లుగా ఆయన తమ సొంత సర్వే ‘కేసీఆర్ 90’ అంటోందని చెప్పు కొచ్చారు. అయితే, అదే క్రమంలో కేటీఆర్, ముందస్తు ఎన్నికల విషయంలో మాత్రం వెనకడుగు వేశారు. అసెంబ్లీ రద్దుకు ముందే, కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలు ప్రకటించాలని, అలా ప్రకటిస్తేనే ముందస్తుకు వెళతామని, కండిషన్ పెట్టారు. అయితే, అది ఎటూ అయ్యేది కాదని తెలిసే, కేటీఆర్ ఈ చిత్రమైన కండిషన్ తెర మీదకు తెచ్చారని, విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. కేటీఆర్ తీరు చూస్తుంటే ఆడలేక మద్దెల ఓడన్నట్లుందని విపక్ష నేతలు అంటున్నారు. ముందస్తుకు వెళ్ళాలా వద్దా అనేది తేల్చుకోవలసింది, అధికార తెరాస. అంతే కానీ, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం లేదా రాష్ట్రంలోని ప్రతిపక్షాలో కాదని, దమ్ముటే గెలుస్తామనే ధీమా ఉంటే ముందస్తుకు వెళ్ళాలి లేదంటే చేతకాదని చేతు లెత్తేయాలని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. నిజానికి, కేసీఆర్, కేటీఆర్ జోడీకి ముందస్తుకు వెళ్ళే ధైర్యం లేదని, అందుకే చేసిన సవాలు వెనక్కి తీసుకునేందుకు తెరాస నాయకులూ తంటాలు పడుతున్నారని అంటున్నారు. నిజానికి, కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కాంగ్రెస్, బీజేపీలకు సవాలు విసిరారు. ఆ రెండు పార్టీలు ఓకే అంటే వెంటనే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు అయితే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ముఖ్యమంత్రి సవాలును స్వీకరించడతో తెరాస నేతలు ఒకరొకరు బయటకొచ్చి మెలికలు పెట్టడం మొదలు పెట్టారని అంటున్నారు. ఆ క్రమంలోనే కేటీఆర్ ఇప్పడు, ముందస్తుకు ముచ్చటే లేదని తేల్చేశారు. ఈ నేపధ్యంలో గత రెండు మూడు రోజులుగా సాగుతున్న, సర్వే డ్రామాలపై కూడా స్టేజి మ్యానేజ్డ్ షోలు కాదు కదా ఆనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే కేటీఆర్ ఓ వంక తమ సర్వే ప్రకారం తెరాసకు తిరుగేలేదని, 90 సీట్లు వస్తాయని చెపుతూనే, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో కొంత మేరకు ప్రభుత్వ వ్యతిరేకత ఉందని అంగీకరించడం అధికార పార్టీ బలహీనత అడ్డం పడుతోందని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, కేటీఆర్ లో కానీ,ఆ మాట కొస్తే ఈ మధ్య ప్రెస్ మీట్లో రెండున్నర గంటలు మాట్లాడిన కేసీఆర్ లో కానీ, ముందున్న విశ్వాసం కనిపించ లేదని అంటున్నారు. అలాగే పార్టీలో కొట్లాటలు ఉన్నాయని అంగీకరించడం ద్వారా కేటీఆర్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఫేస్ చేసే పరిస్థితి లేదని అంటే, తెరాసలో అంతా బాగుందనుకునేందుకు లేదని చెప్పకనే చెప్పారని అంటున్నారు. అలాగే ప్రజల్లో రోజు రోజుకూ పెరుగతున్న ప్రభుత్వ వ్యతిరేకతను కూడా కేటీఆర్ అంగీకరించారు, అందుకే ఆయన కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు త్వరలో ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల మంజూరు నిలిపివేశారు. ఆసరా పెన్షన్ల విషయం అయితే చెప్పనే అక్కరలేదు. అలాగే, ప్రభుత్వఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ అన్నిట్నీ మించి ధరణి పోర్టల్ పెద్ద సమస్యగా మారింది. రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అందుకే కావచ్చును. ధరణిలోనూ మార్పులు చేస్తామని చెబుతున్నారు. సో, కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమని ఏంత గట్టిగా చెప్పినా, ఆయన మాటల్లో ముందున్న విశ్వాసం మాయమై పోయినట్లే కనిపిస్తోందని, అందుకే, ముందస్తు ముచ్చటకు ముగింపు పలికారని, పరిశీలకులు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/is-it-an-end-to-early-elections-discussion-25-139842.html





