కేంద్రంతో కయ్యం వ్యూహాత్మక తప్పిదమా?
Publish Date:Dec 7, 2022
Advertisement
ధాన్యం కొనుగోలు వివాదంతో మొదలైన బీజేపీ వర్సెస్ తెరాస, మోడీ వర్సెస్ కేసేఆర్, స్టేట్ వర్సెస్ సెంటర్ తగవు మెల్లిమేల్లిగా మలుపులు తిరిగి చివరకు,ఇదిగో ఇంతవరకు వచ్చింది. ఓ వంక రాజకీయ రచ్చగా మొదలైన వివాదం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల దాడులకు దారి తీసింది. చివరకు ఇప్పుడు న్యాయస్థానాలకు చేరింది. అయితే, ధాన్యం తగవు మొదలు ప్రస్తుత,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల వ్యూహాత్మక యుద్ధం దాకా, ప్రతి ఎపిసోడ్’లో పై చేయి సాధించేందుకు ప్రత్యర్ధి పక్షాలు వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. అయితే ఆదిలో కేంద్రం వెనకడుగు వేసినట్లే కనిపించినా, కథ అడ్డం తిరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, అధికార తెరాస డిఫెన్సు లో పడుతోందని, జరుగతున్న పరిణామాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ పరిశీలకులు, పేర్కొంటున్నారు. రాజకీయ పరిశీలకులే కాదు తెరాస కీలక నేతలు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్, అనవసరంగా కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వి కష్టాలు కొని తెచ్చుకున్నారని అంటున్నారు. ముందుగా ధాన్యం కొనుగోలు విషయమే తీసుకుంటే, గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ ఎంతగా ఉద్యమాలు చేసినా, చివరకు మిగిలింది సున్నకు సున్నా- హళ్లికి హళ్లి. అంతే కాకుండా ఎనిమిదేళ్ళుగా రైతులు పండించే ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటోందనే భ్రమల్లో ఉన్న రాష్ట్ర రైతాంగానికి, ధాన్యం కొనుగోలులో రైతులకు చెల్లించే ధాన్యం ధరతో పాటుగా, గోనే సంచులు, హమాలీల కూలీతో సహా ధాన్యం సేకరణకు అయ్యే ప్రతి రూపాయి. ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం భరిస్తోందనే నిజం ఇటు రైతాంగానికి అటు రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలిసొచ్చింది. అలాగే కేంద్ర నిదుల కేటాయింపు, రాష్ట్ర అప్పులు ఇతరత్రా వివాదాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వాదనలో పసలేదని, ప్రజలకు అర్ధమైంది. అదొక ఎత్తయితే, ప్రస్తుతం సాగుతున్న కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థల ఆధిపత్య పోరులో కేసీఆర్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) తెలిపోతోంది. ‘సిట్’ పరిధి దాటి, బీజేపీ నాయకుడు బీఎల్ సంతోష్ మరో ఇద్దరికి సర్వ్ చేసిన మెమో చెల్లదని, ఏసీబీ కోర్టు విస్పష్టంగా చెప్పింది. అదే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీ దూకుడు పెంచుతున్నాయి. కోర్టులోనూ సిట్కు ఎదురుదెబ్బలు తగులుతుండం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రధాని నరేందర్ మోడీతో ఎందుకు పెట్టుకున్నామా అన్న భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్ గా కేంద్ర దర్యాప్తు సంస్థలు సాగిస్తున్న దాడి రోజురోజుకూ పెరుగుతోంది. దీని ప్రభావం ఇప్పుడు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీపైనా కనిపిస్తోంది. టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కేంద్రం దర్యాప్తు సంస్ధల్ని ప్రయోగిస్తున్న తీరు ఇటు గులాబీ నేతలతోపాటు అటు వైసీపీ నేతలనూ చికాకు పెడుతోంది. లిక్కర్ స్కాంతో మొదలైన మోదీ దాడి.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వరకూ వచ్చేసింది. దీంతో హైదరాబాద్ కేంద్రంగా ఇన్నాళ్లూ సేఫ్గా వ్యాపారాలు చేసుకుంటున్న ఏపీ నేతలూ ఇరుకున పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ను టార్గెట్ చేసే క్రమంలో టీఆర్ఎస్ నేతల చుట్టూ ఉన్న వారి ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇన్నాళ్లూ టీఆర్ఎస్కు ఆర్థికంగా అండ దండలు అందించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాఫియాతోపాటు ఢిల్లీ లిక్కర్ స్కాం సిండికేట్లను కేంద్రం కదిపింది. వీరిపై కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీతో పాటు ఐటీని కూడా ప్రయోగిస్తోంది. ఆయా సంస్థల దాడులతో లిక్కర్ స్కాం, రియల్ ఎస్టేట్ అక్రమాలన్నీ బయటికి వస్తున్నాయి. ఇందులో టీఆర్ఎస్ నేతల పాత్ర బయటపడుతుండటంతో ఆ పార్టీ ఇరుకునపడుతోంది, పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు కేసీఆర్ ఎదురు దాడి మార్గం ఎంచుకోవడంతో ఇప్పుడు టీఆర్ఎస్ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టార్గెట్ చేసింది. ఆ పార్టీ నేతలు, వారి సన్నిహితులతో అంటకాగుతున్న వైసీపీ నేతల్నీ వదిలిపెట్టడం లేదు. దీంతో ప్రధాని, కేంద్రం ఇస్తున్న సంకేతాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. బీజేపీకి వ్యతిరేకంగా వెళితే పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై కేసీఆర్తో పాటు జగన్కూ ముందస్తు హెచ్చరికలు పంపేందుకే ఎవరినీ లెక్కచేయకుండా ఈ దాడులు చేయిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఏపీలో పరిస్థితులు మారిపోయి వైసీపీ సైతం బీజేపీకి వ్యతిరేకంగా మారితే ఏం జరుగుతుందనే దానికి ట్రైలర్గా తెలంగాణను ఏపీ అధికార పార్టీకి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/is-clash-with-center-a-strategic-mistake-of-kcr-39-148209.html