పాయె.. అయిపాయె.. ఐప్యాక్ కూడా జగన్ కు జెల్ల కొట్టేసింది!
Publish Date:May 14, 2024
Advertisement
జగన్ పని అయిపోయింది. ఎన్నికలలో ఓటమి ఖరారైపోయింది. పోలింగ్ శాతం భారీగా ఉండటంతో జగన్ పార్టీ మూటాముల్లె సర్దుకోవడమే మిగిలింది. ఆ మిగిలిన కాస్తా జూన్ 4న పూర్తైపోతుంది అన్నది ఇప్పటి వరకూ పరిశీలకులు, విపక్ష కూటమి నేతలూ చెబుతున్న మాట. సామాన్యుల అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే అధికారికంగా ఫలితం వెలువడటానికి ఇంకా దాదాపు 20 రోజుల సమయం ఉన్నా.. జగన్ పని అయిపోయిందని చెప్పడానికి తిరుగులేని రుజువుగా ఐప్యాక్ నిలిచింది. ఇన్నేళ్లుగా జగన్ వ్యూహాలు, ఎత్తుగడలన్నిటి వెనుకా నిలిచిన ఐ ప్యాక్ పోలింగ్ పూర్తి కాగానే జగన్ కు జెల్ల కొట్టేసిందని అర్ధమౌతోంది. పోలింగ్ సోమవారం (మే13) పూర్తయ్యింది. మే 15( బుధవారం ఐప్యాక్ రుషిరాజ్ సింగ్ ఆయన టీమ్ జగన్ తో కలిసి విజయోత్సవ సంబరాలు చేసుకునేందుకు ఎప్పుడో నిర్ణయించేసుకున్నాయి. ఆ సందర్భంగా ఐ ప్యాక్ జగన్ ను సన్మానించాలని కూడా భావించింది. అయితే ఇప్పుడు ఆ విజయోత్సవ సంబరం, జగన్ సన్మాన కార్యక్రమం రెండింటినీ కూడా ఐప్యాక్ రద్దు చేసుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే బుధవారం ఐప్యాక్ బృందంతో కలిసి జగన్ పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేలేవారు. కానీ పోలింగ్ రోజు ఉదయం నుంచే ప్రజలలో కనిపించిన ప్రభుత్వ వ్యతిరేకత పోలింగ్ సరళితో ప్రస్ఫుటంగా కనిపించడంతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోయాయి. సాయంత్రం అయ్యేసరికి ప్రజా వ్యతిరేకత సునామీలా ఈవీఎమ్ లలో నిక్షిప్తమైపోయిందని స్పష్టమైపోవడంతో వైపీపీ బెంబేలెత్తిపోయింది. అలాగే ఐప్యాక్ కూడా మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోవడానికి రెడీ అయిపోయింది. దీంతో బుధవారం ( మే 15) విజయవాడ బెంజ్ సర్కిల్ లోని ఐప్యాక్ కార్యాలయంలో జరగాల్సిన వేడుకలకు ఫుల్ స్టాప్ పడింది. జగన్ ను ఐ ప్యాక్ ఆఫీసుకు ఆహ్వానించి సన్మానించాలన్న రుషిరాజ్ సింగ్ ప్రణాళికకు గండిపడింది. జగన్ ఐప్యాక్ కార్యాలయానికి రావడం లేదనీ, ఆయన సన్మాన కార్యక్రమం రద్దైందనీ ఐప్యాక్ వర్గాల ద్వారానే విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు వైసీపీ నుంచి ఐప్యాక్ కు స్పష్టమైన సమాచారం అందింది. దీంతో భారీ ఎత్తున సంబరాలు జరుపుకోవాలన్న ఐప్యాక్, వైసీపీల ప్రణాళిక కార్యరూపం దాల్చకుండానే ఎండ్ కార్డ్ పడిపోయింది. ఇది ఎన్నికలలో జగన్ కు విజయావకాశాలు ఇసుమంతైనా లేవన్న విషయాన్ని నిర్ద్వంద్వంగా చాటుతోందని పరిశీలకులు చెబుతున్నారు. అంతే కాదు ఐప్యాక్ సభ్యులకు కంపెనీ ఇచ్చిన మెబైల్ ఫెన్ లు, ల్యాప్ టాప్ ల బుధవారం (మే 15) ఉదయానికల్లా తిరిగి ఇచ్చేయాలని విస్పష్ట ఆదేశాలు అందాయి. అంతే కాదు వారికి ఇవ్వవలసిన ఈ నెల వేతనాలు, ఇతర అలవెన్సులు అందజేస్తామని తెలిపింది. అంతే కాకుండా ఎవరైన లాప్ టాప్, మెబైల్స్ రిటర్న్ చేయకుంటే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్న హెచ్చరిక కూడా జారీ అయ్యింది. ఇంత అర్జంట్ గా ఐ ప్యాక్ సభ్యుల నుంచి పోన్లు, ల్యాప్ టాప్ లను వెనక్కు తీసుకోవడానికి కారణం ప్రభుత్వం మారితే తమ ఫేక్ ప్రోపగాండా బయటకు పొక్కి చిక్కుల్లో పడతామన్న భయమే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు జగన్ ఐప్యాక్ రిషిరాజ్ సింగ్ ఆయన టీమ్ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, అంతే కాకుండా వారికి ఇస్తామన్న 50 కోట్ల రూపాయల ప్యాకెజీని హోల్డ్ లో పెట్టారనీ తెలుస్తోంది. ఆ కారణంగానే ఐ ప్యాక్ జగన్ సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేసుకుందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/ipack-cancelled-jagan-faciliation-programme-25-175958.html