రేవంత్ కు పొమ్మనకుండా పొగ?
Publish Date:May 28, 2025

Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. వచ్చారు. అందులో విశేషం లేదు. మరో రెండు మూడు రోజుల్లో ఈ నెల 30న మరో సారి కూడా వెడతారు. గ డచిన 17 నెలల్లో మొత్తం 44 సార్లు.. అంటే సగటున నెలకు రెండు సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్రలు చేశారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. నెలలో రెండు సార్లు కాదు, ఒకే రోజులో రెండు సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే.. గతంలో చేసిన యాత్రలకు, ప్రస్తుత యాత్రకు చాలా, ‘తేడా ఉందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి..పార్టీ అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అందులో ఎలాంటి దాపరికం లేదు. ముఖ్యంగా పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సంబంధాలు అస్సలు బాలేవు. ఇది కూడా అందిరికీ తెలిసిన రహస్యమే. అందుకే రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా.. రాహుల్ గాంధీ దర్శన భాగ్యం కలగడం లేదు. అందులోనూ ఈ మధ్య కాలం లో అయితే.. ఇద్దరిమధ్య దూరం మరింతగా పెరిగిందనే ప్రచారం చాలా జోరుగా జరుగుతోంది.
నిజానికి.. ముఖ్యమంత్రి ప్రస్తుత ఢిల్లీ యాత్ర రాజకీయ యాత్ర కాదు. నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన గత శుక్రవారమే ఢిల్లీ చేరుకున్నారు. శనివారం, ప్రధాని నరేంద్ర మోడీ అద్యక్షతన జరిగిన నీతి అయోగ్’ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరో ఒకరో ఇద్దరో కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యారు. అంతవరకు అంతా సవ్యంగానే జరిగింది. అయితే అప్పటికే ఢిల్లీలో ఉన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ఎఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేసమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ పీసీసీ ఏర్పాటు.. మంత్రివర్గ విస్తరణఫై చర్చించినట్లు సమాచారం. నిజానికి ఈ సమావేశం ముందుగా అనుకున్నదా లేక అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యిందా? అన్న విషయంలో క్లారిటీ లేదు.
అయితే.. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ వ్యవహారం ముడిపడక పోయినా.. పీసీసీ కూర్పు వరకు అయితే ఓకే అయిందని అంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో లేక పోవడం వలన నిర్ణయం మే 30కి వాయిదా పడిందని అంటున్నారు. అందుకే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డిలను కూడా ఢిల్లీ రమ్మని అధిష్టానం ఆహ్వానించిందని అంటున్నారు. అదే రోజున మంత్రివర్గ మంత్రి వర్గ విస్తరణ విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కానీ, ఆరోజు ఏమి జరుగుతుంది అనేది.. ఇప్పుడే, ఆ రోజే చెప్పడం కష్టం అంటున్నారు.
అదెలా ఉన్నా.. ఇప్పడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ అంతా.. త్రిబుల్ ఆర్ అంటే రాహుల్ రేవంత్ రిలేషన్స్ చుట్టూనే తిరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీలో తీవ్ర అవ మానం జరిగిందని కాంగ్రెస్ నాయకులే గుసగుసలు పోతున్నారు. ఒక విధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి పూలమ్మిన చోట కట్టెలు అమ్మడలా తయారైందని అంటున్నారు. అవును. ఒకప్పుడు రాహుల్ గాంధీ అండదండలతోనే రేవంత్ రెడ్డి సీనియర్ నాయకులను తొక్కుకుంటూ పీసీసీ పీఠానికి.. అక్కడి నుంచి ముఖ్యమంత్రి కుర్చీకి చేరుకున్నారు. ఇప్పడు అదే రాహుల్ గాంధీ తలుపు తీయడం లేదు.
రాహుల్ గాంధీ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి అప్పాయింట్మెంట్ ఇవ్వలేదు. ఓకే.. కానీ.. ముఖ్య మంత్రిని ఢిల్లీలో ఉండమని చెప్పి.. మూడు రోజులుగా అక్కడే ఉన్నా.. ఆయన్ని పట్టించుకోకుండా, ఆయన ఎదురుగానే పార్టీ సంస్థాగత వ్యవహరాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పీసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో మాత్రమే రాహుల్ గాంధీ, మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ ఏర్పాటుపై చర్చలు జరపడం, పీసీసీ చీఫ్ వచ్చి ముఖ్యమంత్రికి రాహుల్ ఏమన్నారో చెప్పడం సీఎం రేవంత్ కు జరిగిన ఘోర అవమానంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ నాయకులు అయితే ఇది సామాన్యమైన అవమానం కాదని చెవులు కొరుక్కుంటున్నారు. రాహుల్ గాంధీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు ఇంతలా అవమానించారో ఏమో కానీ.. ముఖ్యమంత్రి పరిస్థితి చూస్తే మాత్రం మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లుగా ఉందని అంటున్నారు.
రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యంగా రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యక్ష సంబం ధాలు ఏర్పరచుకుంటున్నారనే అనుమానంతోనే రాహుల్ గాందీ.. ముఖ్యమత్రి రేవంత్ రెడ్డిని దూరం పెట్టడం మొదలైందని అంటున్నారు. అందుకే, పొమ్మన కుండా పొగ పెడుతున్నారా? అనే అను మానాలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. అంతే కాదు, రేవంత్ రెడ్డి అడ్డు తొలిగితే.. కొత్త స్నేహాలకు దారులు ఏర్పడతాయనే ఆలోచన కూడా అధిష్టానం మదిలో ఉందేమో అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. మరో వంక, అలాంటిది ఏదైనా జరిగితే ఏమి చేయాలనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి వ్యూహాన్ని సిద్థం చేసుకున్నారని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో, అధికార పార్టీలో ఎలాంటి అనూహ్య మార్పులు జరిగినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/insult-to-revanth-reddy-in-delhi-39-198845.html












