దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ..!
Publish Date:Jul 17, 2026
Advertisement
భారతీయ రైల్వే రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పడింది. స్వచ్ఛ ఇంధన రవాణా దిశగా అడుగులు వేస్తూ, దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానా వేదికగా గురువారం జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణను కాపాడుతూ, ఇంధన పొదుపు దిశగా భారత రైల్వే సాధించిన ఒక చారిత్రాత్మక విజయంగా ఈ ఘనత నిలిచింది. పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ వినూత్న రైలు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. ఈ రైలు ప్రయాణించడానికి అవసరమైన విద్యుత్ను తనలో ఉన్న హైడ్రోజన్ సహాయంతో స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుంది. దీనివల్ల వాతావరణంలోకి ఎలాంటి హానికరమైన పొగలు విడుదల కావు. కేవలం నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుండడం విశేషం. హర్యానాలోని జింద్ మరియు సోనిపట్ స్టేషన్ల మధ్య ఈ హైడ్రోజన్ రైలు తన తొలి పరుగును ప్రారంభించింది. సుమారు 90 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రయాణ దూరాన్ని కేవలం రెండు గంటల్లోనే చేరుకుంటుంది. 10 కోచ్లతో, అత్యంత శక్తివంతమైన 3,200 హార్స్పవర్ సామర్థ్యంతో ఈ రైలును రూపొందించారు. గ్రీన్ ఎనర్జీ రైళ్లను నడుపుతున్న అతికొద్ది దేశాల సరసన ఇప్పుడు భారతదేశం చేరింది. ఈ రైల్వే ప్రాజెక్టుతో పాటు హర్యానాలో రవాణా రంగానికి ఊతమిచ్చేలా రూ.12,470 కోట్ల విలువైన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. అందులో ముఖ్యంగా రూ.9,680 కోట్ల వ్యయంతో నిర్మించిన 158 కిలోమీటర్ల ఢిల్లీ-అమృత్సర్-కత్రా ఎక్స్ప్రెస్వే మొదటి దశను జాతికి అంకితం చేశారు. దీనివల్ల ఢిల్లీ నుంచి కత్రాకు ప్రయాణ సమయం 14 గంటల నుండి కేవలం 6 గంటలకు తగ్గనుంది. కురుక్షేత్ర నగరంలో రైల్వే క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ప్రత్యేకంగా ఎలివేటెడ్ రైల్వే ట్రాక్ను ప్రధాని ఆవిష్కరించారు. అలాగే ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు భివానీ, నార్నౌల్ ప్రాంతాల్లో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు రావు తులారామ్ ఆసుపత్రిని ప్రారంభించారు. కురుక్షేత్రలో సిక్కు మ్యూజియానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. భారతదేశాన్ని కాలుష్య రహిత దేశంగా మార్చాలనే సంకల్పంలో భాగంగా రైల్వే శాఖ చేపట్టిన ఈ ప్రయోగంపై పర్యావరణవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరెన్నో మార్గాల్లో ఈ హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నయా సాంకేతికత రవాణా రంగంలో ఊహించని మార్పులకు దారితీస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. India first hydrogen train, PM Narendra Modi, Jind Sonipat hydrogen train, Indian Railways green energy, Haryana infrastructure projects 2026.
http://www.teluguone.com/news/content/india-first-hydrogen-train-36-226277.html





