అమెరికా బ్లాక్ మెయిలింగుకి తలొగ్గని భారత్!
Publish Date:Aug 4, 2025
Advertisement
భారత్, రష్యాలను టార్గెట్ చేస్తూ అమెరికా బెదిరింపు అస్త్రాలు సంధిస్తూనే ఉంది. రష్యాను ఏకాకిని చేయాలనో? లేక భారత్ను తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలనో? కారణం ఏదైతేనేం అమెరికా అధికార ప్రతినిధులు ఒకరి తర్వాత మరొకరు భారత్ కు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. భారత్, రష్యా చమురు వాణిజ్యం, అమెరికా టారిఫ్లు, ఒత్తిడి వ్యూహాలు ఇప్పుడు గ్లోబల్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ క్రమంలో తాజాగా భారత్, రష్యాతో చమురు కొనుగోలు విషయంపై ట్రంప్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్పై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే భారత్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం అమెరికాకు అసలు నచ్చుతున్నట్టు కనిపించడం లేదు. ఈ కారణంగా ట్రంప్ సీనియర్ అడ్వైజర్ స్టీఫెన్ మిల్లర్ కూడా తాజాగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్షంగా ఆర్థిక సహాయం చేస్తోందని వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేయాలని ట్రంప్ గట్టిగా చెప్పారని మిల్లర్ అన్నారు. భారత్, రష్యా నుంచి చమురు కొంటూ ఈ యుద్ధానికి ఫైనాన్స్ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాని విషయమని స్టీఫెన్ మిల్లర్ ఓ మీడియా షోలో పేర్కొన్నారు. అంతేకాదు.. భారత్, రష్యా నుంచి చమురు కొనే స్థాయి చైనాతో సమానంగా ఉందని, ఇది చాలా షాకింగ్ విషయమని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జూలై 30న ట్రంప్ భారత్పై పాతిక శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొంటున్నందుకు భారత్ను టార్గెట్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. భారత్, రష్యాలు డెడ్ ఎకానమీస్ అని వ్యాఖ్యానించారు. భారత్ రష్యాతో ఏం చేసినా పట్టించుకోనని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకవేళ రష్యా ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం చేసుకోకపోతే.. రష్యా చమురు కొనే దేశాలపై 100 శాతం టారిఫ్లు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనడం ఆపే సూచనలు కనిపించడం లేదు. భారత ప్రభుత్వ వర్గాలు రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. 2021లో ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత్లో కేవలం 3 శాతం చమురు మాత్రమే రష్యా నుంచి వచ్చేది. కానీ ఇప్పుడు అది 35-40 శాతానికి పెరిగింది. అయితే స్టీఫెన్ మిల్లర్ ట్రంప్, మోడీ సంబంధాల గురించి ప్రస్తావించారు. ట్రంప్కి భారత ప్రధాని నరేంద్ర మోదీతో అద్భుతమైన సంబంధం ఉందని గుర్తు చేశారు. ఈ స్నేహపూరిత వ్యాఖ్యల సంగతి పక్కనపెడితే.. చమురు వాణిజ్యం విషయంలో అమెరికా ఇండియాపై ఒత్తిడి పెంచే విషయంలో అస్సలు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నది. అదే సమయంలో భారత్ కూడా అమెరికా ఒత్తిడికి ఇసుమంతైనా తలొగ్గేందుకు సిద్ధంగా లేదు.
http://www.teluguone.com/news/content/india---not-bowing-to-american-blackmail-39-203421.html





