గవర్నర్ చేతికి హైదరాబాద్?
Publish Date:Jun 10, 2015
Advertisement
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలు గవర్నర్ నరసింహన్కి అప్పగించడానికి పావులు కదులుతున్నట్టు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు కేంద్రం నుంచి వెలువడే అవకాశం వుందని పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. అలాగే పలువురు ఉన్నతాధికారులను ఆయన కలిశారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ కేంద్ర హోంశాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. అలాగే ఉమ్మడి గవర్నర్ నరసింహన్ బుధవారం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో, హోంశాఖ కార్యదర్శితో కూడా భేటీ అయ్యారు. చకచకా, చాలా సీరియస్గా జరుగుతున్న ఈ భేటీలను చూస్తుంటే త్వరలో హైదరాబాద్ శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలను గవర్నర్ నరసింహన్ చేతిలో పెట్టే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో పోలీసు వ్యవస్థ, శాంతిభద్రతల బాధ్యతను పదేళ్ళపాటు ఉమ్మడి గవర్నర్ నిర్వహించాలని విభజన చట్టంలో వుంది. రాష్ట్ర విభజన చట్టంలోని 8 ప్రకారం ఉమ్మడి రాజధాని శాంతిభద్రతల బాధ్యత గవర్నర్దే. విభజన చట్టంలో వున్న అనేక అపరిష్కృత అంశాలలో ఈ అంశం కూడా ఒకటి. రాష్ట్ర విభజన జరిగి ఒక సంవత్సరం దాటినప్పటికీ ఈ అంశంలో కేంద్రం, గవర్నర్ ఇంతవరకు ఎలాంటి చొరవ చూపిన దాఖలాలు కనిపించలేదు. అయితే రేవంత్ రెడ్డి వ్యవహారం, చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు చెబుతున్న ఫోన్ సంభాషణల ఉదంతం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేతిలోనే పోలీసు వ్యవస్థ వుండటం వల్ల ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా జరుగుతున్నాయని, కేసీఆర్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తన చేతిలో పెట్టుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఢిల్లీలో జరిగిన పరిణామాలు గవర్నర్ చేతికి హైదరాబాద్ శాంతిభద్రతలు అందబోతున్నాయన్న సూచనలను ఇస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/hyderabad-police-45-47278.html





