ఇరాన్ లో చిక్కుకున్న తమ పైలట్ ను అమెరికా ఎలా కాపాడిందంటే.. ?
Publish Date:Apr 8, 2026
Advertisement
మధ్య ప్రాచ్యంలో అత్యంత తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ మొదలెట్టిన యుద్ధం నెలన్నరగా సాగుతూనే ఉంది. అగ్రరాజ్యాన్నే కాదు, మొత్తం ప్రపంచం విస్తుపోయేలా ఇరాన్ ఎదురుదాడులు ఉన్నాయి. ఈ యుద్ధంలో అమెరికా భారీగా నష్టపోయింది. అంతేనా ప్రపంచ దేశాలలో పరువు కూడా పోగొట్టుకుంది. ఇది అమెరికా యుద్ధం కాదు, ట్రంప్ వ్యక్తిగత యుద్ధం అన్న స్థాయికి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదలా ఉంటే.. ఇరాన్ తమ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసిన సమయంలో ఆ విమానంలోని ఇద్దరు పైలట్ల ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయారు. వారిలో ఒకరిని అమెరికా రక్షణ దళాలు వెంటనే కాపాడాయి. కానీ రెండో పైలట్ ఆచూకీ కనిపించలేదు. దీంతో అమెరికా తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. మరో వైపు ఇరాన్ అప్రమత్తమైంది. ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న అమెరికా పైలట్ ను ప్రాణాలతో అప్పగించిన వారికి భారీ నజరానా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా రక్షణ దళాలు క్లిష్టమైన, సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ను చేపట్టి విజయవంతంగా పూర్తి చేశాయి. ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయిన తమ యుద్ధ విమాన పైలట్ను ఇరాన్ కళ్లుగప్పి సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చాయి. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాను తలపించేలా సాగిన ఈ ఆపరేషన్లో పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు, వందలాది మంది ప్రత్యేక బలగాలు పాల్గొన్నాయి. అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం కూలిపోవడంతో, అందులోని పైలట్ పారాచూట్ సహాయంతో ఇరాన్లోని పర్వత ప్రాంతంలో దిగాడు. ఆ ప్రాంతం శత్రు బలగాల నిఘా నీడలో ఉండటంతో, ఆ పైలట్ ప్రాణాల ప్రమాదంలో పడ్డాయి. అంతకంటే ముఖ్యంగా ఆ పైలట్ ఇరాన్ కు ప్రాణాలతో పట్టుబడితే.. కీలక రహస్యాలను ఆ దేశం రాబడుతుందన్న ఆందోళన, భయం అమెరికాలో ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ పైలట్ ఆచూకీ కోసం అటు అమెరికా, ఇటు ఇరాన్ కూడా ఇరాన్ కొండలను జల్లెడ పట్టాయి. ఆ పైలట్ ఇరాన్ సైనల కంటపడకుండా ఉండేందుకు ఓ కలుగులో దాగాడు. ఓ వైపు ఇరాన్ దళాల నిఘా నీడలో ఉన్న ప్రాంతంలో చిక్కుకున్న ఆ పైలట్ ఆచూకీ కనుగొనడం అన్నది అమెరికాకు సవాల్ గా మారింది. తన వద్ద ఉన్న అధునాతన సాంకేతికతతో ఇరాన్ కొండల్లోని ఓ కలుగులో దాగి ఉన్న పైలట్ జాడను కనుగొంది. ఇక ఇప్పుడు ఆ పైలట్ ను సురక్షితంగా అమెరికాకు తీసుకురావడం అన్న ఆపరేషన్ చేపట్టింది. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో సాగిన ఈ ఆపరేషన్ ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ పరిధిలో ఉన్న ప్రాంతంలో జరిపి మరీ అమెరికా సక్సెస్ అయ్యింది. అమెరికా హెలికాప్టర్లు, విమానాలు ఇరాన్ క్షిపణి దాడుల ముప్పును ఎదుర్కొంటూనే.. ఎఫ్-22 రాప్టర్స్ వంటి అధునాతన విమానాల రక్షణ కవచం మధ్య ప్రత్యేక దళాలు వ్యూహాత్మకంగా పైలట్ ఉన్న ప్రాంతానికి చేరుకుని అతడిని రక్షించాయి. ఇరాన్ భూభాగం నుంచి తమ పైలట్ సురక్షితంగా వెనక్కు తీసుకురావడంతో ఆ దేశ రక్షణ వ్యవస్థ యొక్క నైపుణ్యం మరోసారి ప్రపంచానికి తెలిసింది.
http://www.teluguone.com/news/content/how-did--america-rescue-its-pilot-36-216902.html





