దాత చేయూతతో పాఠశాల భవనాన్ని.. కార్పొరేట్ స్థాయిలో నిర్మించారు
Publish Date:Jul 20, 2025
Advertisement
దాత చేయూతతో ఓ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కార్పొరేట్ స్థాయిలో ఆధునికీకరించారు. ఆ పాఠశాలలో సుమారు 800 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. చక్కటి ఏకరూప దుస్తులు, మెడలో టై, కాళ్లకు బూట్లు ధరించి ప్రతిరోజు సుమారు 420 పిల్లలు బస్సుల్లో పాఠశాలకు వెళ్తారు. అలాగని ఆ పాఠశాల ఏదో పట్టణంలో లేదు ఓ మారుమూల పల్లెటూరులో ఉంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ లో ఉంది ఈ పాఠశాల. ఇదే గ్రామానికి చెందిన కావేరి విత్తన సంస్థ ఎండి, గుండవరపు భాస్కరరావు ఊరితో పాటు పాఠశాలను దత్తత తీసుకొని ఆధునికీకరించారు. ఆధునికీకరించిన పాఠశాల భవనంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కొనసాగుతున్నాయి. సమీపంలోని 11 గ్రామాల నుండి 420 మంది పిల్లలను పాఠశాలలకు తీసుకురావడానికి మూడు బస్సులు ఏర్పాటు చేశారు. డ్రైవర్లు, క్లీనర్ల వేతనాలు డీజిల్ కోసం దాత భాస్కర్ రావు ప్రతినెల 1.50 లక్షలను వెచ్చిస్తున్నారు. విద్యార్థులకు ఏటా రెండు జతల ఏకరూప దుస్తులు, బ్యాగు, బెల్ట్, టై అందిస్తున్నారు. పాఠశాలలో అవసరమైన ప్రైవేటు ఉపాధ్యాయులను, ఆయాలను నియమించి వారి వేతనాలను తనే చెల్లిస్తూ ఔధార్యాన్ని చాటుతున్నారు. పాఠశాలలో 17 మంది ప్రైవేటు ఉపాధ్యాయులను నియమించి వారికి వారితోపాటు బస్సులను, డ్రైవర్లను, క్లీనర్లను కూడా నియమించి వారి ఖర్చులు కూడా దాత భాస్కర్ రావు భరిస్తున్నారని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలిపారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నరన్నారు. పాఠశాలలో ఇతర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను చేర్చుకోవడం లేదని కేవలం ప్రైవేట్ పాఠశాలల నుండి వస్తున్న విద్యార్థులు మాత్రమే చేర్చుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థుల సంఖ్యలో హనుమకొండ జిల్లాలోనే పాఠశాల ప్రథమ స్థానంలో ఉందని, రానున్న రోజుల్లో 1000 మందికి పైగా విద్యార్థులకు పాఠశాలలో విద్యాబోధన చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. నవోదయ, గురుకుల పాఠశాలల పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులకు బోధన చేయడం జరుగుతుందన్నారు. దాత భాస్కర్ రావు పాఠశాలకు వస్తున్న పేద విద్యార్థుల కోసం ప్రతినెల సుమారు 14 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దాత భాస్కర్ రావు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలకు వసతులు కల్పించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమ పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి రావడానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/hanumakonda-district-25-202321.html





