గుజరాత్లో పేలిన టేప్రికార్డర్ బాంబు: ఇద్దరి మృతి
Publish Date:May 3, 2024
Advertisement
ఫ్యాక్షనిస్టు మద్దెలచెరువు సూరి ఇంట్లో పేలిన టీవీ బాంబు గురించి తెలుగువారికి తెలుసు. అప్పట్లో మద్దెలచెరువు సూరి ఇంటికి ఒక టీవీ పార్సిల్ వచ్చింది. దాన్ని కేబుల్ ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేయగానే టీవీలో వున్న బాంబు పేలి మద్దెలచెరువు సూరి కుటుంబ సభ్యులు చనిపోయారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే గుజరాత్లో జరిగింది. ఈసారి పేలింది టీవీ కాదు.. టేప్ రికార్డర్. గుజరాత్లోని వడాలిలో నివసించే జీతూభాయ్ వంజారా అనే వ్యక్తి ఇంటికి గురువారం నాటు ఒక టేప్ రికార్డర్ పార్సిల్ వచ్చింది. దాన్ని తీసుకున్న జీతూభాయ్, ఆయన కుమార్తె పన్నెండేళ్ళ భూమిక దాన్ని ఆన్ చేసే ప్రయత్నం చేశారు. అంతే టేప్ రికార్డులో వున్న బాంబు పేలి జీతూభాయ్ అక్కడికక్కడే మరణించాడు. భూమిక ఆస్పత్రిలో మరణించింది. అక్కడే వున్న జీతూభాయ్ మరో ఇద్దరు కుమార్తెలకు గాయాలవటంతో వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టేప్ రికార్డర్ బాంబే పేలిన సమయంలో జీతూభాయ్ భార్య ఇంట్లో లేకపోవడంతో పోలీసులకు అనుమానాలు కలిగాయి. జీతూభాయ్ ఇంటికి పార్సిల్ డెలివరీ చేసిన రిక్షాపుల్లర్ని పట్టుకుని విచారణ జరిపితే, ఆ బాంబును పంపించింది బాలుసింగ్ పంజారా అనే వ్యక్తి అని తెలిసింది. పోలీసులు బాలూసింగ్ని అరెస్టు చేశారు. ఈ పేలుళ్ళ వెనుక జీతూభాయ్ భార్య ప్రమేయం ఏమైనా వుందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో వున్న బాలుసింగ్ ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టాడంటే, జీతూభాయ్ పెళ్ళి చేసుకున్న మహిళ బాలూసింగ్కి మాజీ ప్రియురాలు. తన ప్రియురాలిని పెళ్ళి చేసుకున్నాడన్న కోపాన్ని జీతూభాయ్ మీద పెంచుకున్న బాలూసింగ్, జీతూభాయ్ని చంపాలన్న ఉద్దేశంతో తానే స్వయంగా టేప్ రికార్డర్ బాంబు తయారు చేసి పంపించాడు.
http://www.teluguone.com/news/content/gujarat-tape-recorder-bomb-39-175079.html