అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్
Publish Date:Jan 20, 2026
Advertisement
తమిళనాడు అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారు. ఔను తమిళనాడు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్ మధ్యలోనే వాకౌట్ చేశారు. ఈ విషయమై లోక్ భవన్ విడుదల చేసిన ప్రకటనలో దేశంలోని అన్ని శాసన సభలలో గవర్నర్ ప్రసంగానికి ముందు జాతీయ గీతాలాపన చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందనీ, కానీ స్టాలిన్ సర్కారు మాత్రం ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసిందనీ, దీనికి నిరసనగా గవర్నర్ ఆర్.ఎన్.రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినట్లు పేర్కొంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో సభలో జాతీయ గీతాన్ని పాడకుండా ప్రభుత్వం అవమా నించిందని లోక్ భవన్ విమర్శించింది. అసెంబ్లీలో తరచూ జాతీయగీతాన్ని అవమానిస్తుండడాన్ని సహించలేక గవర్నర్ సభలో నుంచి వెళ్లిపోయారని తెలిపింది. ఇలా ఉండగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్ తీరును తప్పుపట్టారు. సభను ఉద్దేశించి ప్రసంగించకుండా వాకౌట్ చేయడం ద్వారా గవర్నర్ రవి సభా సాంప్రదాయాన్ని, నైతికతను ఉల్లంఘించారని విమర్శించారు. ప్రభుత్వం రూపొందించే ప్రసంగ కాపీలో గవర్నర్ అభిప్రాయాలను చేర్చాలన్న నిబంధన ఎక్కడా లేదన్న స్టాలిన్, గవర్నర్ ఆర్.ఎన్.రవి ఉద్దేశపూర్వకంగానే సభను అవమానించడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని సీఎం ఎం.కే.స్టాలిన్ మండిపడ్డారు. మొత్తం మీద అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా పెను వివాదంగా కూడా మారింది.
http://www.teluguone.com/news/content/governer-walk-out-from-assembly-39-212755.html





