కొత్తగా గోల్డ్ మానిటైజేషన్ పాలసీ...సర్వత్రా ఆసక్తి
Publish Date:May 13, 2026
Advertisement
త్వరలో కీలక నిర్ణయం తీసుకోనునన్న కేంద్ర ప్రభుత్వం.. ప్రజలు ఇళ్లలో దాచుకున్న బంగారాన్ని బ్యాంకింగ్ రంగంలోకి తీసుకొచ్చి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. త్వరలో కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్ పాలసీ’ తీసుకురానున్నట్లు సమాచారం. ఈ పథకం ద్వారా ప్రజల ఇళ్లలో నిల్వగా ఉన్న బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 10 గ్రాముల బంగారం ఉన్నా బ్యాంకులో డిపాజిట్ చేసే అవకాశం కల్పించాలనే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. భారతీయుల వద్ద సుమారు 30,000 టన్నుల బంగారం నిల్వగా ఉందని అంచనా. అయితే ఈ బంగారం ఎక్కువగా ఇళ్లలోనే ఉండిపోవడంతో దేశానికి పెద్దగా ఉపయోగం లేదు. దీంతో ఏటా భారీ స్థాయిలో బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ దిగుమతుల వల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. రూపాయి విలువ కూడా ప్రభావితమవుతోంది. కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీ ద్వారా ప్రజలు తమ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే దానిపై వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. అదనంగా పన్ను మినహాయింపులు కూడా ఇవ్వాలని కేంద్రప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనివల్ల సామాన్యులు ఇంట్లో ఖాళీగా ఉన్న బంగారంతో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇక డిపాజిట్ చేసిన బంగారాన్ని జ్యూవెలర్లకు అందించే విధానం కూడా ఉండొచ్చని సమాచారం. దీంతో దేశీయ ఆభరణాల తయారీ రంగానికి ప్రయోజనకరమవుతుంది. ఆర్థిక నిపుణుల ప్రకారం కనీసం 2,000 టన్నుల బంగారం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తే మూడేళ్ల వరకు బంగారం దిగుమతుల అవసరం గణనీయంగా తగ్గవచ్చు. బంగారం దిగుమతులు తగ్గితే రూపాయి విలువ బలోపేతం కావడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో కేంద్రం తీసుకురానున్న కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
బంగారం దిగుమతులు తగ్గితే రూపాయి విలువ బలోపేతం..
http://www.teluguone.com/news/content/gold-monetization-policy-36-219680.html





