మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత
Publish Date:Apr 22, 2026
Advertisement
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో ఉన్న నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యం విషమించి.. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. నాదెండ్ల భాస్కరరావు తెలుగు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. 1978లో తొలిసారిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తదుపరి కాలంలో ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు, ఆయన వెంట నడిచారు. ఎన్టీఆర్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పని చేశారు. 1984లో ఎన్టీఆర్ వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో.. నాదెండ్ల భాస్కరరావు కొంతమంది ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు ఒక నెల రోజుల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరిన భాస్కరరావు, 1989లో తెనాలి నుండి ఎమ్మెల్యేగా, 1998లో ఖమ్మం నుండి ఎంపీగా విజయం సాధించారు. ఆ తరువాత 2019లో బీజేపీలో చేరారు. గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
http://www.teluguone.com/news/content/former-chief-minister-nadendla-bhaskararao-no-more-36-217925.html





