హస్తినలో కాల్పుల కలకలం.. ఒకరికి గాయాలు
Publish Date:Feb 24, 2026
Advertisement
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. గ్యాంగ్ వార్ లో భాగంగా ఈ కాల్పులు జరగడం మరింత ఆందోళనకు కారణమైంది. గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ న్యాయవాది భర్త లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. మంగళవారం (ఫిబ్రవరి 24) రాత్రి ఈ ఘటన జరిగింది. ఉత్తర ఢిల్లీలోని కశ్మీరీ గేట్ ప్రాంతంలో లారెన్స్ బిష్ణోయ్ న్యాయవాది రజనీ ఖత్రీ భర్త ప్రయాణిస్తున్న కారుపై జరిగిన కాల్పులలో ఒకరు గాయపడ్డారు. బిష్ణోయ్ న్యాయవాది రజనీ ఖత్రీ భర్త దీపక్ ఖత్రీ, తన స్నేహితులతో కలిసి కారులో వెడుతుండగా, బైక్పై దుండగులు కారును వెంబడించి వెనుక నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో దీపక్ ఖత్రీ స్నేహితుడికి బుల్లెట్ గాయమైంది. ప్రత్యర్థి ముఠా పనే ఈ దాడికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ బృందాలు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/firing-in-delhi-36-214622.html





