ముజఫర్ పూర్ ఆస్పత్రిలో అగ్రిప్రమాదం.. ముగ్గురుర సజీవదహనం
Publish Date:Jun 4, 2026
Advertisement
బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో గురువారం (జూన్ 4) తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మరణించారు. నగరంలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున సరిగ్గా నాలుగు సమయంలో.. రోగులంతా గాఢ నిద్రలో ఉన్న వేళ ఐదవ అంతస్తులోని ఐసీయూలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే దట్టమైన పొగ, మంటలు ఐసీయూ అంతటా వ్యాపించడంతో అక్కడ ఉన్న రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘోర అగ్నిప్రమాదంలో కనీసం ముగ్గురు రోగులు సజీవ దహనమవగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్లు అత్యంత వేగంగా ఘటనాస్థలికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఐసీయూలో చిక్కుకుపోయిన సుమారు 15 మంది రోగులను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. తీవ్ర పొగ కారణంగా ఊపిరాడక ఇబ్బంది పడుతున్న మిగిలిన రోగులను వెంటనే సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు కానీ, షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కాగా సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా మేజిస్ట్రేట్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో ఉన్న రోగుల కుటుంబ సభ్యుల, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు అధికారికంగా నమోదు చేసుకున్నారు. విచారణ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై, ఆసుపత్రి యాజమాన్యంపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
http://www.teluguone.com/news/content/fire-accident-in-hospital-36-221773.html





