అసదుద్దీన్ కు ఓటమి భయం... తెలుగు పాటలతో హిందూ ఓటర్లకు గాలం
Publish Date:May 4, 2024
Advertisement
40 ఏళ్లుగా హైద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వస్తున్న మజ్లిస్ పార్టీకి ఈ లోకసభ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందా? తండ్రి సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ ( సాలార్) తర్వాత హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. హైదరాబాద్ నియోజకవర్గంలో మెజారిటీ ఓట్లు హిందువులవి. ముస్లింల పార్టీగా ముద్ర పడ్డ మజ్లిస్ గెలుపొందుతూ వస్తోంది. కానీ ఈ ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారింది. బిజెపి తరపున మాధవిలత పోటీ చేయడమే దీనికి ప్రధాన కారణం. బిజెపిలో ప్రాథమిక సభ్యత్వం తీసుకోకుండానే హైద్రాబాద్ టికెట్ దక్కించుకున్న మాధవిలత సోషల్ మీడియా ద్వారా విశేష ప్రాచుర్యం పొందారు. సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేయడమే కాకుండా లతామా ఫౌండేషన్ ద్వారా ఆమె అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆమె ఎలాంటి సెక్యురిటీ లేకుండానే దూసుకుపోయారు.ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఆమెకు వై కేటగిిరి సెక్యురిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. హైద్రాబాద్ బిజెపి అభ్యర్థికి ఇలా సెక్యురిటీ కల్పించడం ఇదే మొదటిసారి. ముస్లిం గర్బిణీ స్త్రీలకు ఉచితంగా ప్రసవాలు చేయించడం , ఆకలితో అలమటిస్తున్న ముస్లిం కుటుంబాలను గుర్తించి రేషన్ సప్లయ్ చేయడం ఆమె గత రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. (పస్మందా) (దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నముస్లింలు) నియోజకవర్గాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారని 40 ఏళ్ల నుంచి వారి కోసం ఆలోచించడం లేదని మాధవిలత వాదన. మాధవిలత ఏనాడు హైదరాబాద్ టికెట్ అడగలేదు. ఆమె సేవలను గుర్తించి బిజెపి అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. టికెట్ వచ్చిన తర్వాతే ఆమె బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. టికెట్ వచ్చిన తర్వాత ఆమె జాతీయ మీడియాను ఆకర్షించారు. ఆమె ఇంటర్వ్యూల కోసం మీడియా ప్రతినిధులు క్యూ కట్టారు. ఇండియా టీవీ ఎడిటర్ రజత్ శర్మ మాధవిలత చేత ప్రతిష్టాత్మక ‘‘ఆప్ కీ అదాలత్ ’’ కార్యక్రమం నిర్వహించారు. రజత్ శర్మ ప్రశ్నలకు ఒక మెచ్యురిటీ నేత మాదిరిగా మాధవిలత ఇచ్చే సమాధానాలు యావత్ దేశాన్ని ఆకర్షించింది. ఆ ఇంటర్వ్యూను వీక్షించాలని సాక్షాత్తు ప్రధాని ట్వీట్ చేయడం గమనార్హం. మాధవిలతకు పెరుగుతున్న ఆదరణతో మజ్లిస్ పార్టీకి ఓటమి భయం పట్టుకున్నట్టుంది. తెలుగు మీడియకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడని అసదుద్దీన్ ఓవైసీ ఏకంగా తెలుగులో పాటలు రాయించుకుని హిందూ వోటర్లను ఆకర్షించడానికి బయలు దేరారు. ఈ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టారు. బ్రాహ్మణులతో సమావేశమయ్యారు. ప్రముఖ గాయకుడు నల్గొండ గద్దర్ చేత పాటలు పాడించుకునే స్థితికి అసదుద్దీన్ చేరుకోవడం ఓటమి భయమే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం వోట్లను కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా చీల్చింది. మజ్లిస్ కు కంచుకోటగా ఉన్న యాకుత్ పురా అసెంబ్లీలో కేవలం 800 పై చిలుకు ఓట్లతో మజ్లిస్ గెలుపొందడం చూస్తే ఆ పార్టీ పరిస్థితి అంచనా వేయవచ్చు. ఇదే సమయంలో మజ్లిస్ పార్టీ నుంచి చీలిపోయిన మజ్లిస్ బచావ తాహ్రీక్(ఎంబిటి) పుంజుకుంది. చాంద్రాయణ గుట్ట మాజీ ఎమ్మెల్యే అమనుల్లా ఖాన్ మజ్లస్ తో విభేధించి ఎంబిటి ఏర్పాటు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు భారతీయ జనతాపార్టీ కారణమని , చివరకు మజ్లిస్ పార్టీ ఆ పార్టీకి సపోర్ట్ గా ఉందని ఎంబిటి విస్తృతంగా ప్రచారం చేసింది. బహింగ సభల్లో అమనుల్లాఖాన్ కుమారుడు అమ్జదుల్లాఖాన్ బోరున విలపిస్తూ చేసిన ప్రసంగాలు ముస్లిం వోటర్లను ఆకట్టుకున్నాయి. యాకుత్ పురా, మలక్ పేట, కార్వాన్, గోషామహల్ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు చాలా తక్కువశాతం మజ్లిస్ పార్టీకి పడ్డాయి. ఎక్కువ వోట్లు ఇతర పార్టీలకు చీలిపోవడం అసదుద్దీన్ ఓవైసీని ఆలోచనలో పడేసింది. ఈ ఎన్నికల్లో ఆయన ప్రముఖ తెలుగు టీవీ చానల్స్ తో బాటు యూ ట్యూబ్ చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ వోటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. _బదినెపల్లి శ్రీనివాసాచారి
http://www.teluguone.com/news/content/fear-of-defeat-for-asaduddin-please-hindu-voters-with-telugu-songs-25-175122.html