తండ్రి పోలీసు, కొడుకు టెర్రరిస్టు .. ఫ్యామిలీ ప్యాకేజ్పై డౌట్లు
Publish Date:May 22, 2025
Advertisement
విజయనగరం టెర్రర్ మాడ్యూల్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్ కన్ఫెషన్ రిపోర్ట్ బయటకు రావడంతో ఒక్కసారిగా కేసులో క్లారిటీ వస్తోంది. సిరాజ్ , హైదరాబాద్కు చెందిన సమీర్, వరంగల్కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బాదర్తో కలిసి ఉగ్రవాద గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు. జకీర్ నాయక్, ఇస్రార్ అహ్మద్, షేక్ యాకుబ్ జమాలి, షేక్ జావిద్ రబ్బాని ప్రసంగాలతో ప్రభావితమైన ఈ గ్రూప్.. ఏకంగా అల్ హింద్ ఇతహదుల్ ముస్లిమీన్.. అంటే అహిం పేరుతో ఓ రాడికల్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ ను దేశవ్యాప్తంగా విస్తరించి.. యువతను మతోన్మాదంవైపు ఆకర్షించాలనేది వీరి ప్లాన్ అన్నది కన్ఫెషన్ రిపోర్ట్ లో తేలిన విషయం. ఇదే కాన్సెప్ట్తో ముంబైలోని మత కార్యక్రమంలో పాల్గొన్నాడు సిరాజ్. అక్కడ మరి కొంత మందితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత వీరికి సౌదీ నుంచి ఆదేశాలు రావడం ప్రారంభమైంది. బీహార్ నుంచి సౌదీకి వెళ్లి అక్కడే ఉంటున్న అబు ముసాబ్ సూచనలతో యాక్షన్ ప్లాన్ కు రెడీ అయ్యారు. భారత్ను ఇస్లాం దేశంగా మార్చాలని టార్గెట్ పెట్టుకున్నారు. అబు సూచనలతో తక్కువ ఖర్చుతో ఐఈడీ బాంబుల తయారీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముస్లిం యువతను మతోన్మాదం వైపు నడిపేందుకు అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమయ్యామని సిరాజ్ చెబుతున్నాడు. బాంబుల తయారీకి అవసరమైన డబ్బులు వీరికి ఒమన్ నుంచి అందాయని తేలింది. ఒమన్లో పనిచేస్తున్న హైదరాబాద్ వాసి ఇమ్రాన్ ఖాన్ ఈ డబ్బును పంపాడని పోలీసులు గుర్తించారు. బాంబుల తయారీకి ఆన్లైన్లో అమోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ను కొనుగోలు చేసింది సిరాజ్ టీమ్. ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్తో పాటు.. స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేశారు. దీపావళి టపాసుల మందుగుండు సామాగ్రిని కూడా కొనుగోలు చేశారు. విజయనగరంలో రద్దీ ప్రాంతాల్లో బాంబు పేల్చడానికి సిరాజ్ కుట్ర పన్నాడు. అయితే పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అరెస్ట్ అయ్యాడు. అతని బైక్ హ్యాండిల్కు ఉన్న సంచిలో నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో ఈ మ్యాటర్ మొత్తం బయటికొచ్చింది. వీరంతా నిత్యం టచ్లో ఉండేందుకు సిగ్నల్ యాప్ వాడారు. సిగ్నల్ యాప్లో సిరాజ్-సమీర్ మధ్య చాటింగ్ జరిగింది. బాంబుల తయారీ, పేలుళ్ల గురించి డిస్కషన్ చేసుకున్నారు. వీరికి డబ్బులు అందితే ఓ స్కూల్ పెట్టి అందులోని కెమికల్ ల్యాబ్లో ప్రయోగాలు చేయొచ్చంటూ చాటింగ్ చేశారు. ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేద్దామంటూ డిస్కషన్ చేసుకున్నారు. ఒక రాకెట్ లాంచర్ ఎలా తయారు చేయాలో తెలిసిందంటూ మాట్లాడుకున్నారు. వీటికి తోడు సిరాజ్కు విజయనగరం సహకార బ్యాంక్ అకౌంట్లో 42 లక్షలు ఉన్నట్టు గుర్తించారు. సహకారబ్యాంక్ అకౌంట్లో అంత డబ్బు ఎలా వచ్చింది..? అనేది తేలాల్సి ఉంది. సిరాజ్ అరెస్టయ్యాక డీసీసీబీ బ్యాంక్లో సిరాజ్కున్న లాకర్ ఓపెన్ చేయడానికి వెళ్లాడు అతడి తండ్రి రెహ్మాన్. పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసే రెహ్మాన్ ముందు సివిల్ డ్రెస్లో, తర్వాత యూనిఫామ్లో బ్యాంక్కు వెళ్లి లాకర్ ఓపెన్ చేయడానికి బ్యాంకు సిబ్బందిపై ఒత్తడి తెచ్చాడు. ఎన్ఐఏ అధికారులు ముందుగానే అలర్ట్ చేయడంతో రెహ్మాన్ను అనుమతించలేదు బ్యాంక్ సిబ్బంది. సిరాజ్ లాకర్ను ఆయన తండ్రి ఎందుకు ఓపెన్ చేయాలనుకున్నాడు..? అన్ని లక్షలు అకౌంట్ లో ఉంటే, అవి ఎలా వచ్చాయని తండ్రి ఎందుకు అడగలేదు? ఇదంతా ముందే తెలుసా..? ఇలాంటి డౌట్లు తెరపైకి వస్తున్నాయి. అన్ని విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అటు సిరాజ్ బాంబ్ పేల్చాలనుకున్న ప్లేసుల్లో ఎన్ఐఏ సెర్చ్ ఆపరేషన్ చేసింది.
http://www.teluguone.com/news/content/father-police-and-son-terrorist-39-198467.html





