రాష్ట్రంలో నకిలీనోట్ల దందా? ఆకర్షించే మార్జిన్మనీ!
Publish Date:Oct 3, 2012
Advertisement
నిన్నటి దాకా నకిలీనోట్ల చెలామణి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. గతంలో 40,60శాతం వాటాలపై ఈ నకిలీకరెన్సీ చెలామణి సాగేదట. ఇప్పుడు ఏకంగా 30శాతం చెల్లించి 70శాతం నికరలాభం సొంతం చేసుకోవచ్చనే వ్యాపారసూత్రం నకిలీకరెన్సీ తయారీదారులు ఫాలో అవుతున్నారట. ఈ మార్జిన్ మనీ ఎక్కువ మందిని ఆకర్షిస్తోందని సమాచారం. అందుకే ఈ లాభాన్ని సొంతం చేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రయత్నాలు విస్తృతమయ్యాయి. ముందుగా 30శాతం చెల్లించి ఆ నకిలీకరెన్సీని సొంతం చేసుకున్న యువకులు కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ముందంజ వేస్తున్నారు. ప్రత్యేకించి ఎక్కువగా మనీ సర్కులేట్ అయ్యే ప్రదేశాలు గుర్తించి వాటిపైనే దృష్టిసారిస్తున్నారు. ప్రధానంగా పెట్రోలుబంకులు, ట్రావెల్ ఏజెన్సీలు, రైల్వేకౌంటర్లు తదితరాలపై ఈ యువకులు ఓ కన్నేసి ఉంచారు. తమకు అనుకూలమైన సమయంలో అంటే వృద్ధులు వంటివారు నిర్వహించేటప్పుడు తమ దగ్గర ఉన్న నకిలీ కరెన్సీని అక్కడ అందజేస్తున్నారు. అలానే కొందరు పెట్రోలు బంకు బాయ్స్ను కూడా ఎంపిక చేసుకుని వారి ద్వారా కూడా కరెన్సీని విస్తృతంగా చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని కూకుట్పల్లిలో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి రెండు లక్షల రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలోనూ ఈ నకిలీకరెన్సీ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. ప్రత్యేకించి అనపర్తి, గొల్లల మామిడాడ ప్రాంతాలకు చెందిన ఒక సామాజికవర్గం ఈ కరెన్సీ చెలామణిలో కీలకపాత్ర పోషిస్తోందని సమాచారం. అయితే ఇటీవల రాజమండ్రి రైల్వేస్టేషనులో కూడా నకిలీకరెన్సీ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్, చిత్తూరు జిల్లాల్లో కూడా ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ప్రత్యేకించి ఈ నకిలీకరెన్సీని పశ్చిమబెంగాల్, ఓడిశా వంటి రాష్ట్రాల నుంచి రవాణా చేస్తున్నారని సమాచారం వెలుగులోకి వచ్చింది. ఏడాది నుంచి ఆరోపణలు వచ్చి నిందితులు దొరికినా పోలీసుశాఖ విచారణలో ముందడుగు వేయలేదు. దీని ఫలితంగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/fake-currency-in-state-31-17871.html





