లోకేష్ కు ఎలివేషన్ లాంఛనమేగా?
Publish Date:May 28, 2025

Advertisement
కడప మహానాడు వేదికగా ఐటీ, విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ప్రమోషన్ లంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీలో, ప్రభుత్వంలో తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్ కు టీడీపీలో నిర్ణయాత్మక పదవి ఇచ్చేందుకు కడప మహానాడు వేదిక అవుతుందన్న ప్రచారం జోరందుకుంది. లోకేష్కు ప్రమోషన్పై టీడీపీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఆ ప్రమోషన్ ఎలా ఉండబోతుందనే ప్రశ్నలకు ఈ మహానాడు సమాధానం చెప్పనుందని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేయాలంటూ పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర వంటి వారు మహానాడు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే వాస్తవానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాకుండా లోకేష్ కు తెలుగుదేశం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నియమించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. లోకేష్ కోసమే ప్రత్యేకంగా పార్టీలో ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ క్రియేట్ చేయబోతున్నట్లు చెబుతున్నారు.
పార్టీలో ఒక నేతకు ఒకే పదవి, అది కూడా రెండు సార్లు మాత్రమే అంటూ ఒక చర్చ జరుగుతోందనీ, ఆ చర్చను ప్రారంభించిందే లోకేష్ అని కూడా చెబుతున్నారు. ఆ మేరకు పార్టీ జాతీయ కార్యదర్శి పదవిని వదులు కోవడానికి లోకేష్ సిద్ధమయ్యారనీ కూడా అంటున్నారు. అందుకే పార్టీలో ఇప్పటి వరకూ లేని ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవిని క్రియేట్ చేసి ఆ పదవిలో లోకేష్ ను నియమించాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగుదేశం తొలి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా లోకేష్ బాధ్యతలు చేపట్టడం లాంఛనమేనని చెబుతున్నారు. వాస్తవానికి తెలుగుదేశంలో ఇప్పటి వరకూ కార్యనిర్వాహక అధ్యక్ష పదవే లేదు. ఇప్పుడా పదవిని క్రియేట్ చేసి మరీ లోకేష్ కు అప్పగించనున్నారని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. నారా లోకేశ్ ఇప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అత్యంత కీలకంగా ఉన్నారు. పార్టీ వ్యవహారాలలోనూ, పాలనాపరంగానూ కూడా లోకేష్ తన ముద్ర బలంగా వేశారు.
అన్నిటికీ మించి లోకేష్ నడక, నడత, ప్రసంగాలూ, ఆలోచనలూ అన్ని యువతకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కూడా లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలన్న డిమాండ్ తెలుగుదేశంలో పెరుగుతోంది. పైగా ఈ డిమాండ్ పార్టీలోని సీనియర్ మోస్ట్ లీడర్స్ నుంచే వస్తోంది. ప్రభుత్వంలో ప్రమోషన్ అంటూ డిప్యూటీ సీఎం. అయితే ఆ విషయంపై మాట్లాడొద్దని చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలను హెచ్చరించడంతో, ఇప్పుడు పార్టీలో ప్రమోషన్ విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ కీలక నేతలు సైతం లోకేష్ కు పార్టీలో మరింత ప్రాధాన్యత పెరగాలని పట్టుబడుతున్నారు. పార్టీ మరింత బలోపేతం కావాలంటే లోకేష్ కు ఎలివేషన్ ఇచ్చి తీరాల్సిందే అంటున్నారు.
ఇక రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలోనూ లోకేష్ చాలా కీలకంగా ఉన్నారు. ఆయన నేతృత్వంలో ఇప్పటి వరకూ 91 ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటుచేయడానికి ముందుకు వచ్చాయి. భారీ స్థాయిలో పెట్టుబడులు, భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలూ కల్పించేందుకు ఆ కంపెనీలు సంసిద్ధంగా ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన పలు సందర్భాలలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో మరింత నిర్ణయాత్మక పాత్ర లోకేష్ కు అప్పగిం చాలని చంద్రబాబు కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో కూడా లోకేష్ కు మంచి గుర్తింపు వచ్చింది. స్వయంగా ప్రధాని మోడీ లోకేష్ ను తన నివాసానికి విందుకు ఆహ్వానిం చారు. మహామహులకే అంత తేలిగ్గా లభించని ప్రధాని మోడీ అప్పాయింట్ మెంట్ లోకేష్ కు అడగకుండానే లభించడమే ఆయన స్థాయి ఏమిటన్నది అవగతమౌతుందంటున్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు ప్రాంగణం నుంచే పార్టీ సీనియర్ లీడర్లు లోకేష్ కు ఎలివేషన్, ప్రమోషన్ కోసం డిమాండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
http://www.teluguone.com/news/content/elevation-to-naralokesh-a-formality-39-198851.html












