ట్రంప్ టార్గెట్ భారత్.. ఫార్మా, కాపర్లపై టారిఫ్ బాదుడు
Publish Date:Jul 10, 2025
Advertisement
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచ దేశాలపై టారిఫ్ల అస్త్రాన్ని ప్రయోగిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే అనేక దేశాలు టారిఫ్ల విషయంలో డీల్స్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉండగా.. రోజుకో దేశానికి షాక్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. లెటెస్ట్గా భారత్ను ఈ లిస్ట్లో చేర్చారు. ఓ వైపు ట్రేడ్ డీల్పై ఓ అవగాహనకు వస్తున్న సమయంలో భారత్ ఎగుమతి చేసే కాపర్, ఫార్మా ఉత్పత్తులపై భారీగా టారిఫ్లు విధిస్తామని అనౌన్స్ చేశారు. ఫార్మా ఉత్పత్తులపై 200 శాతం.. కాపర్పై 50 శాతం టారిఫ్ విధిస్తామని ఓ బాంబు పేల్చారు. నిజానికి ట్రంప్ గతంలో సైతం భారత స్టాక్ మార్కెట్ను అల్లకల్లోలం చేసే వ్యాఖ్యలు చేశారు. కానీ అందులో అమలైనవి చాలా తక్కువే. కానీ ఈసారి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమల్లోకి వస్తే మాత్రం భారత్కు పెద్దదెబ్బే అంటున్నారు. ఎందుకంటే భారత్ ఫార్మా ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఒక్క అమెరికాకే గత ఆర్థిక సంవత్సరంలో 9.8 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇది భారత ఫార్మా ఉత్పత్తిలో 40 శాతం. ఇక కాపర్ విషయానికి వస్తే.. టెక్, కన్స్ట్రక్షన్తో పాటు అనేక రంగాల్లో ఉపయోగించే కాపర్ను అమెరికాకు ఎగుమతి చేస్తోంది భారత్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 బిలియన్ డాలర్ల విలువైన కాపర్ను ఎగుమతి చేసింది. ఆ క్రమంలో ట్రంప్ నిర్ణయాలు నిజంగా అమలైతే భారత్కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే చెప్పాలి. దీనివల్ల ఉత్పత్తిని నిలిపివేస్తే అమెరికాలో మందుల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ట్రంప్ తన టెంపరితనంతో నిజంగానే నిజంగానే టారిఫ్లను విధిస్తే మొదట ఆయా దేశాలకు తిప్పలు తప్పవు. అదే సమయంలో అమెరికాకు కూడా ఇబ్బందులు తప్పవనేది వాస్తవం. ఫార్మా కంపెనీలు ఏసియా దేశాల్లో చాలా తక్కువ ఖర్చుతో వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. అదే అమెరికాలో అయితే మరింత ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇది అమెరికన్లపై మరింత భారం మోపుతాయన్న చర్చ కూడా ఉంది. మరి ట్రంప్ ఆలోచన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
ట్రంప్ ఇప్పటికే స్టీల్, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్లు విధించారు. ఇప్పుడు ఆయన చూపు కాపర్, ఫార్మాపై పడింది. ఫార్మా కంపెనీలు తమ ఫ్యాక్టరీలను అమెరికాలోనే ఏర్పాటు చేసుకోవాలని ట్రంప్ అంటున్నారు. దీని కోసం ఏడాది సమయం ఇస్తామన్నారు. ఆ తర్వాత వారిపై 200 శాతం టారిఫ్లు విధిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే బ్రిక్స్ దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్లు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు అందులోని దేశాలపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. డాలర్ ఆధిపత్యం చేలాయించాలనేది ట్రంప్ ఆలోచన. కానీ బ్రిక్స్ దేశాలు అమెరికా ఆశలకు గండి కొట్టేలా ఉన్నాయనేది ఆయన భయం. అందుకే తన అమ్ములపొదిలోని అత్యంత బలమైన అస్త్రంగా భావిస్తున్న టారిఫ్లను ప్రపంచదేశంపైకి వదులుతున్నారు.
ఇప్పుడు ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. ఇప్పటికే ట్రేడ్ డీల్పై అమెరికాతో మంతనాలు జరుపుతుంది భారత్. ఇక ఇండియన్ ఫార్మా కంపెనీలు తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ను అమెరికాకు తరలించలేకపోయినా.. లేదా ఖర్చులను పెంచలేకపోయినా ఉత్పత్తిని నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనరిక్ మందులు తక్కువ ఆదాయ మార్జిన్లను కలిగి ఉంటాయని.. ఈ క్రమంలో ఫార్మా కంపెనీలు రేట్లను పెంచలేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/donald-trump-25-201677.html





