సిందూర్ పై చర్చకు ఆ ఇద్దరూ దూరం!
Publish Date:Jul 29, 2025
Advertisement
పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ అంశాలపై పార్లమెంటులో సోమవారం (జులై 28) ప్రారంభమైన చర్చ సభ లోపల వెలుపల కూడా రాజకీయ దుమారం రేపుతోంది. అసలేం జరిగింది.. ఆపరేషన్ సిందూర్ విరమణ వెంక ఉన్న రహస్యం ఏమిటి? ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే ఆరోపిస్తునట్లుగా.. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు లొంగిపోయారా? సరండర్ అయ్యారా? ప్రభుత్వం చెపుతున్న విధంగా పాక్ మన దేశానికి లొంగి పోయిందా? అందుకే మన సైన్యం ఆపరేషన్ సిందూర్ కు తాత్కాలిక విరామామ ప్రకటించిందా? ఏది నిజం.. అనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవంక.. ప్రతిపక్ష ఇండియా కూటమి, మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ఒకదాని వెంట ఒకటిగా అస్త్రాలను సంధిస్తోంది. ఇప్పటికే లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ఉప నాయకుడు, గొగోయ్ వరస ప్రశ్నలతో తొలి అస్త్రాన్ని సంధించారు. మంగళవారం(జులై 29) ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంకా వాద్రా చర్చలో పాల్గొంటారు. ప్రభుత్వ పక్షాన ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ విపక్షాలు సభ లోపల వెలుపల చేసిన, చేస్తున్న విమర్శలకు చాలా వరకు సమాధానాలు ఇచ్చారు. కాగా మంగళవారం( జులై 29) హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అటు రాహుల్,ఇటు ప్రధాని మోదీ చర్చలో పాల్గొననున్న నేపధ్యంలో ఎవరు ఏమి మాట్లాడతారు అనే విషయంలో ఆసక్తి వ్యక్తమవుతోంది. అదలా ఉంటే.. ఆపరేషన్ సిందూర్’ విషయంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో తలెత్తిన అంశాలు పార్లమెంట్ చర్చ సందర్భంగా మరో మారు తెరపై కొచ్చాయి. ఆపరేషన్ సిందూర్పై లోక్సభలో జరిగే చర్చల్లో కాంగ్రెస్ నేతలు శశిథరూర్, మనీశ్ తివారీలను పార్టీ దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తివారీ, కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేకంగా మాట్లాడుతోందనే అర్థం వచ్చేలా.. తాను భారత్ వైపే మాట్లాడతానని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. నిజానికి.. ఇప్పటికే రక్షణమంత్రి రాజనాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. ఇక ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచదేశాలకు వివరించడానికి వెళ్లిన అఖిలపక్ష బృందంతో వెళ్ళిన థరూర్, తివారీలను కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ సిందూర్ పై జరిగే చర్చలో ఎందుకు దూరం పెట్టిందనే విషయంగా ఓ వార్తా సంస్థ రాసిన కథనాన్ని తివారీ ఎక్స్ లో పంచుకున్నారు. దానికి పూరబ్ ఔర్ పశ్చిమ్ అనే బాలీవుడ్ సినిమాలోని దేశభక్తి గీతంలో కొన్ని వ్యాఖ్యలను జోడించారు. ఒక భారతీయుడిగా తాను దేశ వైభవాన్నే కోరుకుంటాననేది దాని అర్థం. దీనికి ముందు చర్చల్లో తాను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని తివారీ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థన కూడా పంపారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఆపరేషన్ సిందూర్ పై జరిగే చర్చల్లో థరూర్ ఉండాలని కాంగ్రెస్ కోరిందని.. అయితే, పార్టీ చెప్పిన విధంగా మాట్లాడాలని కోరినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కానీ.. దీనికి ఆయన నిరాకరించినట్లు సమాచారం. దీనిపై విలేకరులు ప్రశ్నించగా.. మౌనవ్రతం, మౌనవ్రతం అంటూ థరూర్ బదులిచ్చారు. దీంతో.. ఆపరేషన్ సిందూర్ పై చర్చ కాంగ్రెస్ కు కూడా పరీక్షగానే మారిందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/discussion-on-sindoor-in-parliament-39-203010.html





