ఆరో వేలు అయినా సరే..
Publish Date:Mar 2, 2025
Advertisement
తోడు పెళ్లి కొడుకు అంటే తెలుసు కదా, ఇది కూడా అంతే. నిజానికి, పెళ్లి తంతులో తోడు పెళ్లి కొడుకుది,ఆటలో అరటి పండు పాత్ర, సినిమా భాషలో చెప్పాలంటే, పెళ్లి పీటల మాత్రమే కనిపించే, గెస్ట్ ఆర్టిస్ట్ రోల్. అయినా తోడు పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి తంతు పూర్తి కాదు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే, దేశంలో ఇప్పడు మరో రకం తోడు పెళ్లి కొడుకుల సందడి నడుస్తోంది. ఇంతకీ,ఎవరా తోడు పెళ్లి కొడుకులు, ఏమా కథ.. వివరాలోకి వెళితే.. అధికారాల పరంగా అంతగా ప్రాధాన్యత లేని,ఉప ముఖ్యమంత్రుల ట్రెండ్ నడుస్తోంది. సగానికి పైగా రాష్టాల్లో ఒకరు అంతకంటే ఎక్కువ మంది, తోడు పెళ్లి కొడుకులు సారీ ఉప ముఖ్యమంత్రులు ( ముఖమంత్రి ) పక్కన కుర్చీ ఎక్కుతున్నారు. అందులోనూ ఆంధ్ర ప్రదేశ్ ‘స్పెషల్ స్టేటస్’లు సొంతం చేసుకుంది. అవును గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ళ పాలనలో మొత్తం తొమ్మిది మంది తోడి పెళ్లి కొడుకులు తెరపై కొచ్చి తెరమరుగై పోయారు. అదెలా ఉన్నా.. దేశంలో చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జోడీ పాలన సాగుతోంది. కొన్ని రాష్ట్రాలలో అయితే ఒకరి కంటే ఎక్కువ మంది ఉప ముఖ్యమంత్రులున్నారు. అయితే,అన్ని రాష్ట్రాల కంటే, ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ జోడీ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని అంటున్నారు. అయితే, అది నిజమే అయితే, ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు? అంటే .. రాజ్యాంగంలో ప్రస్తావించక పోయినా రాజకీయంగా ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి సహా మంత్రులు అందరూ సమానమే అయినా, ఉప ముఖ్యమంత్రి కొంచెం ఎక్కువ సమానం, అనేది పూర్తిగా కాదన లేని నిజం. అలాగే ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన వారిని సర్దుకు పొమ్మని బుజ్జగించేందుకు పార్టీలు ఉపయోగించే ఒక రాజకీయ తాయిలం గానూ ఉప ముఖ్యమంత్రి పదవి ఉపయోగ పడిన సందర్భాలు లేక పోలేదు. అలాగే, సంకీర్ణ ప్రభుత్వాలు ఒడిదుడుకులు లేకుండా సాగేందుకు, భాగస్వామ్య పార్టీల నాయకుల నడుమ సయోధ్యకు ఉప ముఖ్యమంత్రి ఒక ఉపయుక్త మంత్రంగా పని చేస్తుందని అంటారు. కర్ణాటకలో అయితే, ఇప్పటికీ, ఆ వివాదం అప్పుడప్పుడు తెర మీదకు వచ్చి పోతూనే వుంది. ఆరేడు నెలల క్రితం ముఖ్యమంత్రి సిద్దరామయ్య వర్గానికి చెందిన ముగ్గురు మంత్రులు, (సహకార మంత్రి కెఎన్ రాజన్న, గృహనిర్మాణ మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్, ప్రజా పనుల మంత్రి సతీష్ జార్కిహోళి) సామాజిక న్యాయం పేరున తమకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బహిరంగంగానే డిమాండ్ చేశారు. వివాదం సృష్టించారు. అలాగే, మరి కొందరు సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వారితో గొంతు కలిపారు. అయితే, ఎదో విధంగా వివాదం సద్దుమణిగింది. కానీ, మళ్ళీ మళ్ళీ డిప్యూటీ వివాదం అప్పుడప్పుడు తెరపైకి వస్తూనే వుంది. తాజాగా ఇప్పడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, ప్రియాక్ ఖర్గే పేరు కూడా డిప్యూటీ రేస్ లో ప్రముఖంగా వినిపిస్తోంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కుర్చీ ఆశిస్తున్నవారు ముందు చూపుతో ఉపముఖ్యమంత్రి కుర్చీలో కర్చీప్ వేయడం, చాలా వరకు రాష్ట్రాల్లో, నడుస్తున్న చరిత్రలో ముఖ్యంగా ‘కర్ణాటకం’లో ఇది ప్రముఖంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవికి దగ్గర దారి అనుకోవడం వల్లనో ఏమో, ఉప ముఖ్యమంత్రి పదవికి అక్కడక్కడ ఇలాంటి గట్టి పోటీ కనిపిస్తోంది. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ తెరపై కొచ్చింది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కొందరు పార్టీ నాయకులు, ముఖ్యంగా యువ నాయకులు ఈ డిమాండ్ చేసినా, ముఖ్యమంత్రి,పార్టీ అధ్యక్షుడు చద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో సున్చుకుని, ఆ డిమాండ్ ను మొగ్గలోనే తుంచేశారు. సంకీర్ణ ధర్మంలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ప్రాధాన్యత, గుర్తింపు కల్పించేందుకు ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఆ విధంగా ఆయనకు ప్రత్యేక స్థానం కల్పించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సంకీర్ణ ధర్మంతో పాటుగా, రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హుందాగా వ్యవహరుస్తున్నారు. అందుకే, దేశంలో ఎందరు ముఖ్యంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నా, ఏపీ జోడీ, (చంద్రబాబు, పవన్ కళ్యాన్) జాతీయ స్థాయిలోనూ కొద్ది కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే,ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భిన్నంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దన్నగా ముందుండి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ముందుకుసాగుతున్నారు. అందుకే,ఏపీ మోడల్ ‘రోల్ మోడల్’ గా నిలిచింది. అదలా ఉంటే ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, శాసన సభ ఉన్న మూడు కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి. వాటిలో మణిపూర్ లోరాష్ట్ర పతి పాలన విధించడానికి ముందు 31 మంది ముఖ్యమంత్రులు 26 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. అంటే, రాజ్యాంగంలో ఎక్కడా ఉప ముఖ్యమంత్రి ప్రస్తావన లేక పోయినా, ప్రస్తుతం దేశంలో సగానికి సగం (15) రాష్ట్రాలలో ముఖ్యంత్రి, ఉప ముఖ్యమంత్రి జోడీ పాలన సాగుతోంది. పెళ్లి పీటల మీద పెళ్ళి కొడుకుకు తోడుగా తోడు పెళ్లి కొడుకును కూర్చో పెట్టినట్లు, ముఖ్యమంత్రికి తోడుగా పక్కన ఉప ముఖ్యమంత్రి కుర్చీ ఉండడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఒక విధంగా ఇదొక రాజకీయ అవసరంగా మారింది. మరి కొన్ని రాష్ట్రాల్లో కులాల మధ్య సమతుల్యత కోసం ఉపముఖ్యంత్రుల నియమకాలు జరుగ్తున్నాయి. అందుకే కొన్ని రాష్ట్రాల్లో ఒక్కరే ఉప ముఖ్యమంత్రి ఉంటే, మరి కొన్ని రాష్ట్రాల్లో అంతకంటే ఎక్కువమంది ఉప ముఖ్యమంత్రులు ఉంటున్నారు. చివరగా, ఆంధ్ర ప్రదేశ్ ను ఐదేళ్ళు పాలించిన జగన్మోహన్ రెడ్డి ఆ ఐదేళ్లలో మొత్తం 9 మందిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు..ముందు అదేదో అద్భుత ప్రయోగం అన్నట్లు ఏకంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించుకున్న జగన్ రెడ్డి, ఆ తర్వాత మంత్రి వర్గం మార్పులు చేరుల్లో భాగంగా పాత వారిని తప్పించి కొత్తగా మరో నలుగురికి అవకాశం కల్పించారు. చివరకు, ఏమి జరిగింది ... 9 ప్లస్ 2 మిగిలింది.
అందరికీ తెలిసిందే, అది ఆరో వేలు అయినా, ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పాకులాడే వారికి కొదవ లేదు. నిజానికి, రాజ్యాంగంలో ఉప ప్రధాని, ఉప ముఖ్యమంత్రి పదవుల ప్రస్తావనే లేదు. ఆ పదవికి ప్రత్యేక హక్కులు, అధికారాలు, బాధ్యతలు అనేవి ఏవీ ఉండవు.ఈ మధ్యనే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇందుకు సంబంధించి ఇంకొంత క్లారిటీ కూడా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక ‘ప్రోటోకాల్’ ఉండదని, స్పష్టంచేశారు. మంత్రులందరిలో ఉప ముఖ్యంత్రి కూడా ఒకరని, ఉన్నది ఉన్నట్లుగా తేల్చి చెప్పారు.
అయితే ఉప ముఖ్యమంత్రి పదవి రాజకీయ సంక్షోభానికి దారి తీసిన సందర్భాలు లేక పోలేదు. ఇటీవల కాలంలోనే, కర్నాటక, తెలంగాణ సహా మరి కొన్ని రాష్ట్రాలలో ఒకరికంటే ఎక్కువ మందికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు అక్కడ డీకే శివ కుమార్, ఇక్కడ బట్టి విక్రమార్క ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. పంతం నెగ్గించుకున్నారు.
ఇంకొంచెం లోతుల్లోకి వెళితే, ఉప ముఖ్యమంత్రుల నియామకం గతంలో ప్రాంతీయ పార్టీలకే పరిమితం అయితే ఇప్పడు జాతీయ పార్టీలూ అదే బాటలో నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలలో ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రల్లోనూ చాల వరకు రాష్ట్రాల్లో ఒకరికి మించి ఉప ముఖ్యమంత్రులున్నారు. ఉత్తర ప్రదేశ్ లో పెళ్లి పీటలే ఎక్కని, ముఖ్యమంత్రి యోగీఅదిత్య నాథ్ కు అటు ఒకరు, ఇటు ఒకరు ఇద్దరు తోడి పెళ్లి కొడుకులున్నారు. అలాగే, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ ఘఢ్, ఒడిస్సా, బిహార్ చివరకు నాగాలాండ్, మేఘాలయ రాష్టాలకు కుడా ఇద్దరేసి ఉప ముఖ్యమంత్రులున్నారు. ప్రాంతీయ పార్టీల ఏలుబడిలోని తమిళనాడులో తండ్రీ కొడుకులు (స్టాలిన్ ,ఉదయ నిధి స్టాలిన్)ముఖ్యమంత్రి, ఉప ముఖ్యంత్రిగా ఉన్నారు. ఎటొచ్చి, కమ్యూనిస్టుల ఎలుబడిలో ఉన కేరళ, మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్, బీజేపీ పాలిత అస్సాం వంటి రాష్ట్రాలలో మాత్రమే ముఖ్యమత్రుల ఒంటి చేతి పాలన సాగుతోంది.
http://www.teluguone.com/news/content/deputy-cm-became-a-political-compulsary-39-193718.html





