లిక్కర్ కేసులో ఇరుక్కున్న వారంతా ఓటమిపాలేనా?
Publish Date:Jul 31, 2025
Advertisement
ఇప్పటి వరకూ ఢిల్లీ, తెలంగాణ, ఛత్తీస్ గడ్ లో జరిగిన మద్యం కుంభకోణాలకు సంబంధించి అప్పటికి అధికారంలో ఉన్న పార్టీలు ఓటమి పాలయ్యాయి. దానిని బట్టి చూస్తే ఏపీలో కూడా అదే జరిగిందని తెలుస్తున్నదా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇక ఏపీ మద్యం కుంభకోణం కేసులో తాజాగా మా..ము (మాజీ ముఖ్యమంత్రి) జమోరె (జగన్మోహన్ రెడ్డి) సైతం పీకల్లోతు కూరుకుపోయారు. ఈయన, ఈయన పార్టీ పరిస్థితి కూడా అంతేనా? అంటే అవుననే చెప్పాల్సి ఉందంటారు విశ్లేషకులు. వారి విశ్లేషణలను బట్టి వచ్చే రోజుల్లో ఆయన ఏదైనా ఉప ఎన్నికలకు వెళ్లినా.. లేకుంటే మరేదైనా ఎన్నికల్లో పాల్గొన్నా.. ఈ మద్యం పాపం అంత తేలిగ్గా వదలదు. ఆంతే కాదు త్వరలోనే జగన్ అరెస్టు పక్కా అని కూడా అంటున్నారు. అలాగుంటుంది మద్యం కుంభకోణమంటే.. ఇప్పటి వరకూ జరిగిందదే ఇకపై జరగబోయేది కూడా అదే అంటున్నారు విశ్లేషకులు. దానికి తోడు మిగిలిన రాష్ట్రాలకూ ఏపీకీ ఉన్న మరో పెద్ద తేడా, డిస్ అడ్వాంటేజీ ఏంటంటే... ఆంధ్రప్రదేశ్ లో కల్తీ, నాసిరకం మద్యం తాగి ఎందరో చనిపోయారు. మరెందరో అనారోగ్యం పాలయ్యారు. దీంతో వీరి శాపం అంత తేలిగ్గా వదలదని అంటారు దగ్గుబాటి దుర్గా ప్రసాద్ వంటి నేతలు. వారి శాపమే జగన్ పార్టీ లీడర్లను ఒక్కొక్కరిగా అరెస్టు అయ్యేలా చేస్తుందని అంటారాయన. ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయని అంటారు. ఢిల్లీలో పాలనా పరంగా ఎంతో మంచి పేరు సాధించారు కేజ్రీవాల్. ఆయన విద్య, వైద్య రంగాల్లో ఒక రోల్ మోడల్ గా ఢిల్లీని తీర్చి దిద్దిన పరిస్థితి. అవినీతి మీద పోరాడిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అనే పార్టీ పెట్టి.. ఆ పార్టీ ద్వారా అనూహ్యంగా ఢిల్లీలో విజయం సాదించి.. ఆపై పంజాబ్ లో కూడా ఖాతా తెరిచి.. మినీ కాంగ్రెస్ పార్టీగా పేరు సాధిస్తూ వచ్చిన కేజ్రీ క్రేజ్ అమాంతం తగ్గిందంటే అందుకు కారణం లిక్కర్ స్కామ్. ఈ కేసులో సీఎంగా జైలుకు కూడా వెళ్లి వచ్చారాయన. దీంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలు కావల్సి వచ్చింది. ఇక ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చిక్కిన కల్వకుంట్ల కవిత. కవిత ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ నేత. ఎమ్మెల్సీ. ఇప్పుడూ ఆమె అదే పార్టీలో, అదే హోదాలో ఉన్నారు కానీ.. కానీ అప్పుడు మరింత డీప్ గా ఆ పార్టీ ప్రతినిథిగా పని చేశారు. ఒక సమయంలో కవితను అరెస్టు చేయకుంటే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సంబంధ బాంధవ్యాలుంటాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి వారు కామెంట్ చేయడంతో.. అది నిజమేనని నమ్మిన జనం కేసీఆర్ పార్టీని గత ఎన్నికలలో ఓడించి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అంటే మందుకు మంచింగ్ లా.. మందుకు చెందిన స్కాముల్లో చిక్కిన వారు డెఫినెట్ గా ఓడిపోతారనడానికి మనకు దగ్గర్లోనే ఇన్నేసి ఉదాహరణలున్నాయి. వారు తప్పక అరెస్టవుతారన్న మాట కూడా ప్రచారంలో ఉంది. ఇక చత్తీస్ ఘడ్ మద్యం కుంభకోణం. 2019- 2022 మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ కారణంగా చైతన్య భాగెల్ తండ్రి భూపేష్ భాగెల్ ఘోరంగా ఓడిపోయారు. 1500 కోట్ల రూపాయల ఈ స్కామ్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ ఓటమి పాలు కావల్సి వచ్చింది. ఈ స్కామ్ కి ఏపీ లిక్కర్ స్కామ్ కి ఎన్నో పోలికలుంటాయి. అక్కడా ఇక్కడా మనీ ల్యాండరింగ్ కి సంబంధించిన అనేక ఆనవాళ్లు కనిపిస్తాయ్. కాబట్టి జగన్ రెడ్డికి గడ్డుకాలమే అంటున్నారు చాలా మంది. మద్యం కుంభకోణంలో ఇరుక్కుంటే తర్వాత వారికి రాజకీయంగా ఇబ్బందికర పరిణామాలు తప్పవంటున్నారు పరిశీలకులు. అయినా కొందరు మాత్రం ఎన్నోకేసులు ఉండి కూడా గత పదేళ్లకు పైగా దర్జాగా బెయిలు మీద తిరుగుతున్న జగన్ కి ఏమీ కాదంటారు కొందరు. ఆ మాటకొస్తే మోడీ ఉండగా జగన్ జైలుకెళ్లే ప్రసక్తే లేదన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయ్. అయితే వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు కూలినట్టు.. ఎన్నో స్కాముల ఆరోపణలు ఉన్న జగన్ ఒక్క మద్యం స్కాములో జైలుకెల్లడం ఖాయమని మరి కొందరు గట్టిగా చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/defeat-is-the-result-for-all-thouse-involved-in-liquoescams-39-203138.html





