పట్టులోనూ అవినీతి ‘పట్టు’!
Publish Date:Dec 11, 2025
Advertisement
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి చుట్టూ మరీ ఇన్ని అవినీతి బాగోతాలా? మొన్న లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం, నిన్న పరకామణి చోరీ అంశం.. తాజాగా పట్టు వస్త్రాల అవినీతి బండారం. పాపం వెంకన్న ఇంత పెద్ద నామాలతో కళ్లు మూసుకుని ఉంటారు కాబట్టి వీరిష్టానికి వీరు యధేచ్చగా దోపిడీ చేసేస్తున్నారు. ఆయన నిజ నేత్ర దర్శన సమయంలో ఈ అవినీతి బండారం ఎవరో ఒకరి రూపంలో బయట పడేస్తున్నారు. ఇంతకీ తాజా వ్యవహారంలో ఉన్నది ఎవరు? ఏమిటని చూస్తే.. పదేళ్ల కాలంలో అంటే, 2015- 25 మధ్యకాలంలో కేవలం పట్టు కండువాల కుంభకోణంలో 54 కోట్ల పై చిలుకు కొల్లగొట్టేశారంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. శ్రీవారు రాత్రింబవళ్లు కాళ్లు నొప్పులు పుట్టేటట్టు నిలుచుంటారు. ఇక జనం బాధలు విని విని, చెవులు చిల్లులు పడేలాంటి పరిస్థితి. వారి కష్టనష్టాలన్నీ విని వారి ఆర్తనాదాలన్నీ తీర్చినందుకుగానూ కానుకల రూపంలో రోజూ కోటి రూపాయలకు పైగా హుండీలో జమ అవుతుంటాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడిగా తిరుమల వేంకటేశ్వ రస్వామి అలరారుతున్నారు. అటువంటి వెంకన్న దేవుడి సొమ్ము సరే కాజేయాలన్న ఆలోచన కొద్దీ.. కొందరు అవినీతి పరులు ప్రతి చిన్న విషయానికీ.. పెద్ద పెద్ద టెండర్లు వేసి శ్రీవారి సొమ్ము ఇదిగో ఇలా స్వాహా చేస్తున్నారు. తాజాగా శ్రీవారి సొమ్ము ఎలా కాజేశారో చూస్తే.. స్వామి వారి దగ్గరకు వచ్చే ప్రముఖులకు ఒక శేష వస్త్రం కప్పడం ఆచారం. అయితే స్వామివారి స్థాయికి తగ్గట్టు, ఈ వస్త్రం పట్టుగా ఉండాలని భావించి నగరిలోని ఒక సంస్థకు ఈ కాంట్రాక్టు అప్పగించారు. ఈ సంస్థ గత కొంతకాలంగా మూడు వందలు కూడా చేయని పట్టు వస్త్రానికి పదమూడు వందలకు పైగా వసూలు చేస్తోంది. సరే ఇదేమైనా ప్యూర్ మల్బరీ పట్టా? అని చూస్తే.. అది కూడా కాదని తేలింది. టీటీడీ విజిలెన్స్ విభాగం ల్యాబ్ లో టెస్ట్ చేయించగా.. ఆ సంస్థ పాలిస్టర్ పాలిస్టర్ వస్త్రాలను సరఫరా చేసినట్లు తేలింది. ఈ ఏడాది కూడా ఈ వస్త్రం 15 వేల ఆర్డర్లు ఇచ్చింది టీటీడీ. ఇదెలా బయట పడిందో చూస్తే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇలాంటిదే ఒక పట్టు వస్త్రం కొనగా దాని ధర 400 వందల రూపాయలు కూడా లేదు. ఈ విషయం గుర్తించిన ఆయన టీటీడీ కొంటున్న పట్టు పై కండువా ధర పరిశీలిస్తే అది 1300 రూపాయలకు పైగా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆయన ఈ పట్టు బండారం మొత్తం కూపీ లాగగా ఇక్కడ కూడా యాభై కోట్లకు పైగా దోపిడీ జరిగినట్టు తెలిసింది. ఇలా శ్రీవారి విషయంలో ప్రతి చిన్న విషయంలోనూ ఏదో ఒక అవినీతి మయంగా మారడం చూస్తుంటే.. ఇందుకు ఒక అంతు దరీ లేదా అన్న విస్మయం కలుగుతోంది. భక్తులు తాము స్వామి వారికి కానుకగా, ముడుపుగా సమర్పించిన సొమ్ము అవినీతి పరుల పాలౌతోందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగని ఇదేం ఎక్కడో ఉండే బోలే బాబా వంటి నకిలీ నెయ్యి సరఫరా చేసే సంస్థ కాదు.. దగ్గర్లోనే ఉండే నగరిలోని వీఆర్ఎస్ అనే సంస్థ. ఈ ప్రాంతంలో స్వామి వారి పట్ల ఎన్నో భయభక్తులుంటాయి. అలాంటి వీరికి కూడా వెంకన్నదేవుడంటే అంటే భయం భక్తీ, భయం లేకుండా పోవడం సంచలనంగా మారింది.
http://www.teluguone.com/news/content/cooruption-in-ttd-pattuvastralu-36-210824.html





