కమలదళంలో అసమ్మతి గళం..
Publish Date:Jan 17, 2022
Advertisement
భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ ఆ తర్వాతనే వ్యక్తి, అని అంటారు. కానీ, వాస్తవంలో అది నిజం కాదు. అన్ని పార్టీలలో, ఉన్న విబేధాలు, విద్వేషాలు కమల దళంలోనూ ఉన్నాయి. ముఖ్యంగా ఇతర పార్టీల నాయకులు వచ్చి చేరడం మొదలైన తర్వాత, పార్టీలో పాత కొత్తల మధ్య ఒక విధమైన సైలెంట్ వార్ సిట్యువేషన్, నిశ్శబ్ద యుద్ద వాతావరణం బల పడుతోందని, పార్టీ అంతర్గత వ్యవహారాలను దగ్గరగా గమనిస్తున్న విశ్లేషకులు భావిస్తునారు. నిజానికి నిన్న మొన్నటి వరకు పార్టీలో కొత్తగా చేరిన నాయకులకు అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు.. వారి సీనియారిటీకి గుర్తింపు ఉండేది కాదు. అందుకే నాగం జనార్ధన రెడ్డి మొదలు మోత్కుపల్లి నరసింహులు, పెద్దిరెడ్డి వరకు అనేకమంది నాయకులు బీజేపీలో ఉక్కపోతను భరించలేక బయటకు వెళ్లి పోయారని అంటారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలకు ఇచ్చిన గౌరవం మొదటి నుంచి పార్టీని , సిద్ధాతాన్ని నమ్ముకుని ఉన్నవారికి దక్కడం లేదని జల్లా నాయకులూ, కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. పార్టీ నాయకుల్లో లోలోపల రగులుతున్న అసంతృప్తి ఇంకా పూర్తి స్థాయిలో బయటకు భగ్గుమనక పోయినా, భగ్గుమనే రోజు ఇంకెంతో దూరంలో లేదనే సంకేతాలు మాత్రం స్పష్టమవుతున్నాయని అంటున్నారు. రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలు రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం.అంతే కాకుండా, జిల్లాకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంతృప్త నేతలు అందరినీ ఏకం చేయాలని సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే జరిగితే ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో రెండో అధికార తెరాసకు ప్రధాన ప్రత్యర్ధిగా ఎదుగుతున్న పార్టీలో సమ్మతి సెగలు భగ్గుమంటే, పరిస్థితి చేజారి పోతుందని పార్టీ లో చర్చ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పుడు ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత, ఆ పరిస్థితి మారిపోయింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు ముందు వరసలోకి వచ్చారు. ఒరిజినల్ కమల దళం నాయకులు వెనక్కి వెళ్లి పోయారు. ఒక విధంగా పాత కాపులు హీట్ ఫీలవుతున్నారు.అందుకే, ఇప్పుడిప్పుడే కమల దళంలో అసమ్మతికి అంకురార్పణ జరిగిందని అంటున్నారు. అది కూడా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ సొంత జిల్లా,కరీంనగర్’ లోనే మొదలైందని, ‘రహస్య’ మిత్రుల సమాచారం. అసంతృప్తికి ఆయనే మూల బిందువని అంటున్నారు.
అయితే, తెలంగాణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పార్టీ జాతీయ నాయకత్వం రహస్య సమావేశానికి సంబందించిన సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీరియస్’ గా తీసుకున్న కేంద్ర నాయకత్వం వెంటనే ఈ వ్యవహారంపై నివేదిక పంపించాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ను ఆదేశించినట్లు చెబుతున్నారు. ఆయన కూడా పూర్వాపరాలు తెలుసుకుని రెండు రోజుల్లో పక్కాగా నివేదిక పంపనున్నారని సమాచారం.మరో వంక, ఈ రహస్య సమావేశం వెనక వరసగా ఎదురు దెబ్బలు తింటున్న అధికార తెరాస నాయకత్వం ఉందని అంటున్నారు. ఏమైనా క్రమశిక్షణకు మరు పేరనుకున్న బీజేపీలోలోనూ ముసలం పుట్టింది. కమల దళంలోనూ అసమ్మతి గళం మొదలైందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/cold-war-in-bjp-39-130268.html