పార్లమెంట్ సమావేశాల వేళ రణరంగంగా మారిన ఢిల్లీ..!
Publish Date:Jul 20, 2026
Advertisement
సీజేపీ చలో పార్లమెంట్ ఉద్రిక్తం, పోలీసుల ఆంక్షలు..! పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యా వ్యవస్థలో జరుగుతున్న వరుస అవకతవకలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చిన 'చలో పార్లమెంట్' కార్యక్రమం రణరంగంగా మారింది. నిరసనకారుల ర్యాలీని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగడంతో జంతర్మంతర్ పరిసరాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పోలీసులు విధించిన ఆంక్షలను సైతం లెక్కచేయకుండా వేలాది మంది ప్రజలు, విద్యార్థులు ఈ ఆందోళనలో భాగస్వామ్యమయ్యారు. రహదారుల గుండా నిరసనకారులు ముందుకు సాగకుండా పోలీసులు భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. భద్రతా అంచనాల ప్రకారం దాదాపు ఎనిమిది వేల మందికి పైగా నిరసనకారులు జంతర్మంతర్ వద్దకు చేరుకోవడంతో, అల్లర్ల నియంత్రణకు వాడే ప్రత్యేక రక్షణ వాహనాలను సైతం అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) లోని సెక్షన్ 163 ప్రకారం నగరంలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ర్యాలీకి ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని హెచ్చరించినప్పటికీ, ఆందోళనకారులు పార్లమెంట్ భవనం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పరిగెత్తుకు వచ్చిన నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ కోణంలో ఢిల్లీలోని అత్యంత కీలకమైన ఐదు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేయడంతో పాటు పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ భారీ నిరసన ప్రదర్శనలో ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ సతీమణి గీతాంజలి ఆంగ్మో కూడా పాల్గొన్నారు. దేశంలో విద్యా వ్యవస్థను పట్టిపీడిస్తున్న సమస్యలపైనే అందరూ కేంద్రీకరించాలని, ఆందోళనలను ప్రజాస్వామ్యయుతంగా, అత్యంత శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. గత నెల రోజులుగా నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో పాటు పలు విద్యాసంస్థల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్తో సీజేపీ ఈ పోరాటాన్ని నడుపుతోంది. పార్లమెంట్ వేదికగా కేంద్రానికి తమ నిరసన సెగ తగలాలనే ఉద్దేశంతోనే ఈ చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేశారు. ఈ వివాదంపై రాబోయే రోజుల్లో పార్లమెంట్ లోపల, బయట విపక్షాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర నిరసనలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విద్యావ్యవస్థ ప్రక్షాళనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/cockroach-janata-party-protest-delhi-36-226514.html





