రైతులకు నీళ్లు కావాలి.. రాజకీయాలు కాదు..రేవంత్పై హరీశ్ రావు ఫైర్
Publish Date:Jul 12, 2026
Advertisement
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులు సాగునీరు అడిగితే రక్తం గురించి మాట్లాడటం ముఖ్యమంత్రికి తగదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం కావాలనే దుష్ప్రచారం చేస్తోందని, ప్రస్తుతం గోదావరిలో తగినంత నీరు ఉన్నప్పటికీ కన్నెపల్లి, దేవాదుల మోటార్లను ఆన్ చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఈగోకు పోతే థర్మల్ పవర్ ప్లాంట్లకు నీటి కొరత ఏర్పడి రాష్ట్రం అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. బీఆర్ఎస్ పాలనలో సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి పథకాల వల్ల రాష్ట్రంలో వరి ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2.60 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో 6.64 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందగా, బీఆర్ఎస్ హయాంలో 48.74 లక్షల ఎకరాలకు నీరు అందించామని చెప్పారు. మేడిగడ్డపై నివేదిక ఇచ్చిన అధికారులు గతంలో పోలవరం ప్రాజెక్టులో పనిచేసిన వారేనని, వారి హయాంలోనే వేల కోట్ల నష్టం జరిగిందని ఆరోపించారు. నీటిని కిందకు వదిలేస్తూ పట్టిసీమకు మేలు చేస్తున్నారని, ఇది గురువు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఇస్తున్న గురుదక్షిణ అని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వెంటనే కన్నెపల్లి, దేవాదుల మోటార్లను పూర్తి స్థాయిలో ప్రారంభించి రైతులను ఆదుకోవాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-36-225810.html





