కేసీఆర్ మార్క్ బడ్జెట్
Publish Date:Nov 5, 2014
Advertisement
ఈరోజు తెలంగాణా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన రాష్ట్ర తొలి బడ్జెట్ తెరాస అధినేత కేసీఆర్ ముద్ర చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలను అన్నిటినీ అమలుచేసేందుకు బడ్జెట్ లో కేటాయింపులు చేసారు. ముఖ్యంగా విద్య, వైద్య, విద్యుత్ రంగాల అభివృద్ధికి తగిన విధంగా బడ్జెట్ లో కేటాయింపులు జరిపారు. అదేవిధంగా రోడ్ల నిర్మాణం, చెరువుల పునరుద్దరణ, సాంఘిక సంక్షేమానికి కూడా బడ్జెట్ లో చాలా ప్రాధాన్యం ఇచ్చినట్లు కనబడుతోంది. అయితే తెలంగాణా రాష్ట్ర సాధన కోసం దాదాపు 1200-2000 మంది వరకు యువకులు బలిదానాలు చేసుకొన్నట్లు చాలాసార్లు చెప్పిన తెరాస ఇప్పుడు కేవలం తను గుర్తించిన 459మంది అమర వీరులకు మాత్రమే బడ్జట్ లో రూ.100కోట్లు కేటాయించడం చాలా ఆక్షేపించవలసిన విషయం. మిగిలిన అమరవీరులు చేసిన త్యాగాలను గుర్తించకపోవడం వారిని అవమానించినట్లే. వారి త్యాగాల కారణంగానే ఈ రోజు తెరాస అధికారంలోకి వచ్చిందనే విషయం గ్రహించి ఉంటే, మిగిలిన అందరి కుటుంబాలను తప్పకుండా ఆదుకొనిఉండేది. అందుకోసం ఇందిరా పార్క్ లో రూ.15కోట్లతో నిర్మించతలపెట్టిన తెలంగాణా కళా భవన్ మానుకోవచ్చును లేదా న్యాయవాదులు, జర్నలిస్టులకి కలిపి కేటాయించిన 115కోట్ల ఖర్చు తగ్గించుకోవచ్చును. ఇక తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ సమయంలో విద్యుత్ ఉత్పాదనకి చాలా భారీగా కేటాయింపు చేస్తారని అందరూ భావించారు. కానీ విద్యుత్ రంగానికి కేవలం రూ.3241 కోట్లు, తెలంగాణా జెన్ కోలో ప్రభుత్వ పెట్టుబడిగా మరో 1000కోట్లు మాత్రమే కేటాయించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ రోడ్ల నిర్మాణానికి ఏకంగా రూ 10వేల కోట్లు కేటాయించారు. మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలతో, జిల్లా కేంద్రాలను రాజధానితో కలుపుతూ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. అదేవిధంగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సాగునీటి సమస్యను పరిష్కరించడానికి రూ 2వేల కోట్ల కేటాయించారు. తొలివిడతలో రాష్ట్రంలో తొమ్మిదివేల చెరువులను పూడికలు తీసి రిపేర్లు చేస్తున్నారు. వాటి పునరుద్దరణతో పొలాలకు నీటి సౌకర్యం ఏర్పడటమే కాక బోరు బావులలో మళ్ళీ నీటిమట్టాలు పెరుగుతాయి. అదేసమయంలో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి, సరఫరాకు కూడా ప్రభుత్వం చేప్పటిన చర్యల కారణంగా రైతులు నీళ్ళ మోటర్లకు విద్యుత్ సరఫరా మెరుగయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఈవిధంగా కేసీఆర్ సాగు నీరు, విద్యుత్ రెండు సమస్యలను ఒకేసారి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నందున బహుశః ఒకటి రెండు సం.లలో సమస్యలు ఒక కొలొక్కి రావచ్చును. ఇక రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీ, యస్సీ,ఎస్టీ మరియు మైనార్టీ వర్గాలకు బడ్జెటులో తగు కేటాయింపులు చేసారు. బీసీల సంక్షేమానికి రూ.2022 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.1030 కోట్లు, ఎస్సీల సబ్ ప్లాన్ కు రూ.7579 కోట్లు, ఎస్టీల సబ్ ప్లాన్ కు రూ.4559 కోట్లు కేటాయించారు. కళ్యాణ లక్ష్మి పధకం క్రింద ఎస్సీలకు రూ.150 కోట్లు, ఎస్టీలకు రూ.80కోట్లు కేటాయించారు. ఎస్సీల అభివృద్ధి కోసం 2014-19 వరకు రూ.50 వేల కోట్లు ఖర్చుచేయబోతున్నట్లు ప్రకటించారు. ఒకవిధంగా ఈ బడ్జెట్ తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కలలు కంటున్న ‘బంగారి తెలంగాణా’ సాధనకు వేసిన తొలి అడుగుగా చెప్పవచ్చును.
http://www.teluguone.com/news/content/cm-kcr-45-39933.html