అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి..!
Publish Date:Aug 12, 2026
Advertisement
అధికారుల వేధింపులే కారణమంటూ సెల్ఫీ వీడియో...! అధికారుల వేధింపులు, పని ఒత్తిళ్లే కారణమంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ ఆశా వర్కర్ చికిత్స పొందుతూ మృతి చెందింది. చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వి.కోట మండలం భారత్నగర్కు చెందిన రాణి ఆశా వర్కర్గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు, వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లేందుకు సెలవు కోరగా.. అనుమతి నిరాకరించడంతో పాటు రెండు నెలల జీతం నిలిపివేస్తామని అధికారులు బెదిరించినట్లు రాణి ఆరోపించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్ మాధవి, నిత్య తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ రాణి సెల్ఫీ వీడియో రికార్డు చేసినట్లు తెలిపారు. తన ఆత్మహత్యాయత్నానికి వారే కారణమని ఆరోపిస్తూ.. సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీడియోలో కోరినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆత్మహత్యాయత్నం అనంతరం రాణిని వేలూరులోని సీఎంసీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఐదు రోజుల పాటు చికిత్స పొందిన ఆమె ఇవాళ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాణి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. ఆమె ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని, బాధ్యులుగా తేలిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కోరుతున్నారు. Chittoor District, Asha Worker, Asha Worker Death, Suicide Attempt, Harassment Allegations, Official Harassment, Work Pressure, Medical Officer, V Kota, Bharat Nagar, CMC Hospital Vellore, Andhra Pradesh, Health Department, Asha Worker Suicide
http://www.teluguone.com/news/content/chittoor-district-36-228732.html





