రాజ్యసభలో జగన్ కేసుల ప్రస్తావన.. విచారణ ఆలస్యంపై టీడీపీ ఆందోళన.. !
Publish Date:Aug 5, 2026
Advertisement
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ తీవ్ర జాప్యం కావడంపై పార్లమెంట్ వేదికగా తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. రాజ్యసభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు సవరణ బిల్లుపై జరుగుతున్న చర్చ సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. జగన్పై ఉన్న దాదాపు 31 తీవ్రమైన క్రిమినల్ మరియు సీబీఐ కేసుల్లో విచారణ ప్రారంభమై 13 ఏళ్లు దాటినా ఇప్పటివరకు స్పష్టమైన పురోగతి లేకపోవడంపై ఎంపీ విజయ్ సభలో తీవ్ర ఆందోళన వ్యక్తపరిచారు. సీబీఐ ప్రత్యేక కోర్టులలో కేసుల పురోగతి నెమ్మదించడం వల్ల వ్యవస్థపై ప్రభావం పడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు, నిందితులు కోర్టుల్లో వరుసగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తూ విచారణను సుదీర్ఘ కాలం పాటు పొడిగిస్తున్నారని విమర్శించారు. ఒకవైపు విచారణ పూర్తయి తుది తీర్పు వెలువడే సమయానికి న్యాయమూర్తులు బదిలీ కావడం, మరొకవైపు జడ్జీల కొరత వల్ల ఈ కేసులు దశాబ్దానికి పైగా మూలనపడిపోతున్నాయని వివరించారు. కేవలం డిశ్చార్జ్ పిటిషన్లను పరిష్కరించడానికే 13 ఏళ్ల సమయం పడితే, ఇక అసలు కేసుకు సంబంధించిన ప్రధాన ట్రయల్ ఎప్పుడు పూర్తవుతుంది? తుది తీర్పు ఇంకెప్పుడు వస్తుందని ఎంపీ విజయ్ ఘాటుగా ప్రశ్నించారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన వ్యక్తిగత అంశం మాత్రమే కాదని ఆయన ఉద్ఘాటించారు. న్యాయం జరగడంలో ఇటువంటి అపరిమిత జాప్యం చోటుచేసుకుంటే చట్టపరిపాలన, సీబీఐ మరియు సమగ్ర న్యాయ వ్యవస్థపై సామాన్య ప్రజలకు ఉండే విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టుల పనితీరును వేగవంతం చేయడానికి, కావలసిన నియామకాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, రాజ్యసభలో టీడీపీ ఎంపీ ఈ అంశాన్ని ప్రస్తావించగానే ప్రతిపక్ష వైసీపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా ప్రాంగణంలోనే విజయ్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ పెద్దెత్తున నిరసనకు దిగడంతో సభలో కాసేపు తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ముఖ్యమైన రాజకీయ నాయకుల కేసుల్లో జరుగుతున్న ఈ జాప్యంపై న్యాయ కోవిదులు, సామాన్య ప్రజలు కూడా సుదీర్ఘ కాలంగా చర్చించుకుంటున్నారు. అత్యున్నత చట్టసభ వేదికగా లేవనెత్తిన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ప్రత్యేక కోర్టుల్లో విచారణ స్పీడప్ అవుతుందో లేదో వేచి చూడాలి. Chintakayala Vijay, YS Jagan CBI Cases, Rajya Sabha TDP MP, Supreme Court Judges Bill, AP Politics Telugu News
http://www.teluguone.com/news/content/chintakayala-vijay-36-228131.html




