హిట్ అండ్ రన్ కంటే ఘోరంగా వైసీపీ.. చంద్రబాబు
Publish Date:Apr 1, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేరుగా వైసీపీ పేరు ప్రస్తావించకుండానే కుట్ర రాజకీయాలు చేస్తున్న పార్టీగా అభివర్ణించారు. హిట్ అండ్ రన్ నేరాల కంటే అత్యంత ఘోరమైన నేరాలకు పాల్పడిన పార్టీగా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని దుయ్యబట్టారు. అలవోకగా అబద్ధాలు చెబుతూ, వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని వైసీపీ పేరు చెప్పకుండానే ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అంశంపై వైసీపీ ఆరోపణలను ఖండించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు తమ ప్రభుత్వ హయాంలోనే సిద్ధమయ్యాయని.. కానీ ఆ క్రెడిట్ను దక్కించుకోవడానికి వైసీపీ పచ్చి అబద్ధాలు చెబుతోందన్నారు. మత్స్యకారుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఇతర ప్రాంతాల మత్స్యకారులు ఏపీ జలాల్లోకి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన పేదల సేవలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా పెన్షన్లు అందిస్తున్నామని, గతంలో ఇచ్చిన హామీ మేరకు 'తల్లికి వందనం, దీపం 2.0' వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఇంటింటికీ పైపులైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/chandrababu-slams-ycp-false-propaganda-39-216524.html





